సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 21: జిల్లాలో వానకాలంలో కనీసం 25 శాతం వెదజల్లే పద్ధతిలో రైతులు సాగు చేసేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని వ్యవసాయశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం వరిసాగు కార్యాచరణ ప్రధానంగా ధాన్యం వెదజల్లే పద్ధతి వరిసాగు విస్తీర్ణం పెంపుపై అధికారులు దృష్టి సారించాలన్నారు. జిల్లాలో మొత్తం 127 ఏఈవో క్లస్టర్ల పరిధిలో రెండు లక్షల 30 వేల ఎకరాల్లో లక్షా 32 వేల 331 మంది సంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు. వెదజల్లే పద్ధతిలో వరిసాగుపై స్థానిక ప్రతినిధులు, ఆదర్శ రైతులతో గ్రామస్థాయిలో సమావేశాలను రైతు వేదికల్లో జరిగేలా చూడాలన్నారు. ఇప్పటికే వెదజల్లే పద్ధతిలో విజయవంతంగా సాగుచేస్తున్న రైతులతో సమావేశాల్లో మాట్లాడించి ఇతర రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లాలో వానకాలంలో 50 వేల ఎకరాల్లో వెదజల్లే పద్దతిలో రైతులు వరి సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు కృషి చేయాలన్నారు. వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. రైతుబంధు సమితి సభ్యులు, అధ్యక్షుడు, స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యంతో ప్రతి క్లస్టర్ పరిధిలో మొత్తం చేస్తున్న వరిసాగులో కనీసం 25 శాతం వెదజల్లే పద్దతిలో సాగు చేసేలా వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. వెదజల్లే పద్దతిలో జిల్లాను మొదటిస్థానంలో నిలపాలని వ్యవసాయశాఖ అధికారులకు సూచించారు. వారం రోజుల్లో మరోసారి వెదజల్లే పద్ధతిలో వరిసాగుపై వ్యవసాయశాఖ తిరిగి సమావేశం నిర్వహిస్తామన్నారు. అప్పటికల్లా వ్యవసాయశాఖ అధికారులు తమ క్లస్టర్లో రైతుల వివరాలు, సాగుచేస్తున్న పంట విస్తీర్ణం, వెదజల్లే పద్ధతిలో వరిసాగు చే స్తున్న రైతుల వివరాలతో రావాలన్నారు. సమావేశంలో జిల్లా వ్య వసాయశాఖ అధికారి శ్రవణ్కుమార్, వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
వరిలో వెద సాగుతో రైతులకు మేలు
వరిలో వెద పద్దతి చేపట్టడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు పొందవచ్చని సిద్దిపేట ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డా.విజయ్ అన్నారు. సోమవారం చాట్లపల్లి గ్రామంలో వరిలో వెద సాగుపై ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతు వెద సాగు ద్వారా రైతులకు రూ.10 వేల నుండి 15 వేల వరకు పెట్టుబడి తగ్గడంతో పాటు, ఎకరాకు 2నుండి 3క్వింటాళ్ల దిగుబడి పెరుగుతుందన్నారు. ముఖ్యంగా కూలీల కొరతను అధిగమించేందుకు ఈవిధానం ఎంతో దోహదం చేస్తుందని సూచించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతు రైతులకు పంటల సాగుకు అవసరమైన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో రైతుబంధు మండల కోఆర్డినేటర్ జంబులశ్రీనివాస్రెడ్డి, సర్పంచ్ రాచర్ల నరేశ్, ఎంపీటీసీ కావ్యదర్గయ్య పలువురు రైతులు రాజిరెడ్డి, బిక్షపతి, దేశాయిరెడ్డి, మల్లయ్య, సాయులు, కనకయ్య, లింగం తదితరులు పాల్గొన్నారు.
వేద సాగుపై అవగాహన సదస్సు
రైతులు వరిలో వేద సాగు పద్ధతిని అలవర్చుకోవాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. సోమవారం వ్యవసాయ శాఖ, ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్యం) ఆధ్వర్యంలో రైతులకు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ లక్ష్మి మాట్లాడుతూ…రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలన్నారు. యాంత్రీకరణ నేపథ్యంలో ఆ దిశగా సాగుకు సమాయత్తం కావాలన్నారు. తప్పనిసరిగా పంట మార్పిడి విధానాన్ని పాటించాలన్నారు. అనంతరం జాతీయ ఆహార భద్రత పథకం కింద ఉచితంగా రైతులకు చిరు కందుల ప్యాకెట్లను అందజేశారు. ఈ సదస్సులో సర్పంచ్ కరివేద ప్రమీల, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలునాయక్, ఏఈవో సంగీత, ఆత్మ అధికారి భారతిరాజా, కరివేద నరేందర్రెడ్డి, రంగు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
గుడికందులలో
వరి సాగును వెద పద్ధతిలో చేపట్టడంవల్ల ఎంతో మేలు జరుగుతుందని మండల వ్యవసాయాధికారి మోహన్ తెలిపారు. గుడికందులలో వెద పద్ధతిపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, సర్పంచ్ గంగనిగల్ల మల్లయ్య, ఏఇవో దేవేందర్తో పాటు రైతులు పాల్గొన్నారు.