సిద్దిపేట, మే 20 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ఈనెల 30 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. తొమ్మిదో రోజు గురువారం ఉమ్మడి మెదక్ జిల్లాలో లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలైంది. అత్యవసర విధులు నిర్వర్తించే వారిని అనుమతించి, అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో లాక్డౌన్ ను మరింత కట్టుదిట్టం అమలు చేశారు. కనోనా చైన్ లింక్ను తెంపడానికి లాక్ డౌన్ పొడిగించిందని, జిల్లాలో లాక్డౌన్ను మరింతగా పక్కాగా అమలు చేయడానికి యంత్రాంగానికి, పోలీసులకు ప్రజలు సహకరించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. లాక్డౌన్ సడలింపు సమయంలో ఇంటి నుంచి ఒక్కరే పోయి వారం రోజులకు సరిపడా వుస్తువులు తెచ్చుకోవాలని సూచించారు. ఈనెల 12 లాక్డౌన్ అమలులోకి వచ్చింది. లాక్డౌన్ ఉల్లంఘించిన వారు, సడలింపు సమయంలో మాస్కులు ధరించక, సామాజిక దూరం పాటించని వారిపై ఈ తొమ్మిది రోజుల్లో సిద్దిపేట జిల్లాలో 188 ఐపీసీ యాక్టు కింద 1,593 కేసులు నమోదు చేశారు.ఈ-పాస్ ద్వారా ఆన్లైన్లో 1,428 పాసులు జారీచేశారు. సంగారెడ్డి జిల్లాలో 3,513 కేసులు నమోదు కాగా, ఆన్లైన్లో 1,576 పాస్లు జారీచేశారు. మెదక్ జిల్లాలో 662 కేసులు నమోదయ్యాయి. 274ఆన్లైన్ పాస్లు జారీచేశారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు వద్ద నిఘాను పటిష్టం చేశారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో లాక్డౌన్తో అన్ని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జిల్లా కేంద్రాలైన సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్తో పాటు ప్రధాన పట్టణాలు, మున్సిపాలిటీలు,మండల కేంద్రాలు, గ్రామాల్లో లాక్డౌన్ను సరిగ్గా ఉదయం 10 గంటల నుంచి అమలు చేస్తున్నారు. దీంతో వ్యాపార, వాణిజ్య సంస్థలు ఎక్కడికక్కడ మూసి వేస్తున్నారు. కాగా, ఉదయం 6 గంటల నుంచే ఆయా జిల్లాల్లో ప్రజలు తమకు కావల్సిన నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వస్తున్నారు. మార్కెట్ల వద్ద కూరగాయలు, పాలు ఇతరత్రా సామగ్రిని తీసుకున్నారు. 10 గంటల తర్వాత జనం రోడ్లపైకి రావడం లేదు. అత్యవసర సేవలు యథావిధిగా నడిచాయి.వ్యవసాయ రంగానికి సంబంధించిన పనులు నడిచాయి. ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలతో పాటు ఉపాధి హామీ పనులు కొనసాగాయి. ప్రభుత్వ ఉద్యోగులు 33 శాతం చొప్పున కార్యాలయాలకు హాజరవుతున్నారు.
కరోనా కట్టిడికి
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు…
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తన్నీరు హరీశ్రావు జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చర్యలు తీసుకుంటున్నారు. రెండు రోజలుగా మంత్రి హరీశ్రావు జిల్లాల పర్యటనలు చేస్తూ కరోనా వ్యాధిగ్రస్తుల వార్డులకు వెళ్లి వారితో నేరుగా మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. మీకు నేనున్నాను అని భరోసానిస్తున్నారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించిందని వివరిస్తున్నారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో మంత్రి హరీశ్రావు జిల్లా కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాట్లు, తదితర అంశాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆయా జిల్లాలో అవసరమైన ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మందులు అందుబాటులో ఉంచడంతో పాటు కొవిడ్ రోగులను నిరంతరం పర్యవేక్షించేలా వైద్యులను షిప్టుల వారీగా డ్యూటీలు చేసేలా చర్యలు తీసుకున్నారు. కొవిడ్కు సంబంధించిన సమాచారం, ప్రజల సందేహాలను ఆ హెల్స్ డెస్క్లకు ఫోన్ చేసి తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.