సిద్దిపేట, మే18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విచ్చలవిడిగా రసాయనాలతో సాగుచేసిన ఆహార పదార్థాలు తినడంతో మనుషులు అనేక రకాల జబ్బుల బారినపడుతున్నారు. వ్యవసాయం లో రసాయనిక ఎరువులు, పురుగుల మందుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఆ ఆహారం తీసుకున్న వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నాగపురి గ్రామం సేంద్రియ సాగుచేస్తూ ఆదర్శంగా నిలిచింది. గ్రా మానికి చెందిన జక్కుల తిరుపతి, చేర్యాల ఎంపీపీ కరుణాకర్, స్రర్పంచ్, గ్రామస్తులు కలిసి సేంద్రియ విధానంలో దేశవాళీ వంగడాలను సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంపీపీ కరుణాకర్ ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఆయన భార్య కవిత ఎంబీఏ చదివారు. ఈ ఇద్దరు సేంద్రియ సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలాబట్టి (బ్లాక్ రైస్), మణిపూర్ బ్లాక్, చిట్టి ముత్యాలు, మహారాజ(సుగంధభరితం), చింతలూరి సన్నాలు, కూజీ పటాలి వంగడాల సాగుకు గ్రామం కేంద్రంగా మారింది. ఈ గ్రామంలో ఒక్కరితో ప్రారంభమైన సేంద్రియ సాగు, ప్రస్తుతం 30మంది రైతులకు చేరింది. గ్రామంలోని రైతులందరూ సాగుచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం గ్రామంలో విత్తన బ్యాంకు ఏర్పాటు చేసుకున్నారు. రైతులకు విత్తనాలను నాగులకు ఇస్తున్నారు.కిలో విత్తనాలు ఇస్తే పంట పండిన తర్వాత రెండు కిలోల విత్తనాలు ఇచ్చే పద్ధతి అన్నమాట. ఇప్పటికే గ్రామంతో పాటు ఇతరులకు కలిపి 100 మందికి విత్తనాలు అందించారు. నాగపురిలో 30మంది రైతులు 25ఎకరాల్లో సేంద్రియ సాగుచేశారు. ఈ పంట వానకాలంలో అధిక దిగుబడి వస్తుంది. దీంతో ఎక్కువ మంది ఆ కాలంలోనే పంటలను సాగుచేయడానికి మొగ్గు చూపుతున్నారు.
కాలాబట్టి(బ్లాక్ రైస్)…
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం నాగపురి గ్రామానికి చెందిన జక్కుల తిరుపతి, అతని మిత్రుడు ఆవుల అజిత్ కలిసి యాసంగిలో 10 ఎకరాల్లో సాగుచేశారు. పది ఎకరాల్లో గత వానకాలం నుంచి ఈ యాసంగి వరకు 56 రకాల విత్తనాలను ప్రాక్టికల్గా సాగుచేశారు. ప్రస్తుతం దీనిలోనే 6 ఎకరాల విస్తీర్ణంలో 56 రకాల వంగడాలను సాగుచేశారు. ప్రస్తుతం వారు కాలాబట్టి, మణిపూర్ బ్లాక్, మహారాజ (సుగంధ భరితం)వంగడాలను పండిస్తున్నారు. కాలాబట్టిలో(బ్లాక్ రైస్) బీ6, బీ12 మిటమిన్లు ఎక్కువగా ఉండడంతో పాటు ైగ్లెస్మిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఆ బియ్యం తినడంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. క్యాన్సర్ వచ్చిన వారికి తగ్గించే గుణం ఉంటుంది. రాని వారికి రాకుండా నివారించే గుణం దీనిలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అన్నిరకాల బియ్యంలో 70 శాతం కంటే ఎక్కువ ఉంటే , వీటిలో చాలా తక్కువ 55 నుంచి 41 శాతం మధ్యన ైగ్లెస్మిక్ ఇండెక్స్ ఉంటుంది. తద్వారా మధుమేహ రోగులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో క్యాన్సర్ కణాలను సైతం నివారిస్తుంది. పంటరత్న, చింతలూరి సన్నాలు, కూజీ పటాలి ఇవన్నీ తెలుపు రంగులో బియ్యం సన్నగా ఉంటాయి. వీటిలో పోషక విలువలు ఎక్కువగా ఉండి ఉబకాయాన్ని తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండడంతో మలబద్ధ్దకం సమస్యను నివారిస్తుంది. కాలాబట్టి రకంలో బియ్యం నల్లగా ఉండడంతో సూర్యరశ్మిని అధికంగా తీసుకుంటుంది. అలా తీసుకోవడం వల్ల డీ-మిటమిన్ ఏ మేరకు ఉందో తెలుసుకోవడానికి త్వరలోనే ఒక పరిశోధన చేయించేలా ప్రణాళికను సిద్ధ్దం చేస్తున్నారు.
రెండో రకం మణిపూర్ బ్లాక్..
మణిపూర్ బ్లాక్ రకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. దీని ప్రత్యేకత బియ్యం, వడ్లు రెండూ నలుపు రంగులో ఉంటాయి. దీనిని ఐదు ఎకరాల్లో సాగుచేశారు. తెలంగాణ పొట్టి ములకలు ఇవన్నీ షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి. గర్భిణులకు ‘కుల్లాకార్ రకం’బియ్యం బాగా పనిచేస్తాయి. సుఖ ప్రసవానికి, తల్లీబిడ్డకు మంచి పోషకాహారం, బిడ్డకు సరిపడ పాలను ఇస్తాయి. సుగంధ భరితం రకం అన్నం వండితేనే సువాసన వస్తుంది. ఇక ‘చిట్టి ముత్యాలు’ ఇది షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనిలో గ్లెస్మిక్ ఇండెక్స్ 55 శాతం ైఉంటుంది. ఇది షుగర్ను తగ్గించడానికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇక మహారాజ(సుగంధ భరితం) లో చింతలూరి సన్నాలు, కుజిపటాలి.. వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడానికి చాలా బాగుంటాయి. వీటిని అందరూ తినవచ్చు. ఈరకం నాగపురిలో 10 ఎకరాలకు పైగా సాగుచేశారు.
సాగు పద్ధతులు..
ముందుగా పొలంలో పచ్చిరొట్ట వేసి కలియ దున్నడంతో భూసారం పెరుగుతుంది. ఆ తర్వాత ఆవుపేడ వేస్తారు. ఆవుపేడ, ఆవు మూత్రం, బెల్లం, శనగ పిండి, చెట్టుకింద ఉన్న గుప్పెడు మట్టితో పాటు మిగతావి కావాల్సినంత తీసుకొని ఒక డ్రమ్లో కలియ పెడతారు. ఇలా తయారుచేసిన సేంద్రియ ఎరువును ఎకరానికి 200 లీటర్ల చొప్పున చల్లుతారు. ఇలా తయారు చేసిన జీవామృతాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి చల్లుతారు. దీంతో ఎలాంటి ఎరువులు, మందులు వేయకుండానే పంటలను తీస్తారు. పూర్తిగా సేంద్రియ పద్ధ్దతిలో సాగుచేస్తారు. బ్లాక్ వరి(రైస్)లో ఉన్న రకాలను బట్టి 110 రోజులు, 120 రోజులు, 150 రోజులకు పంట చేతికి వస్తుంది. ఈ రకం ఎక్కువగా వానకాలంలో మంచి దిగుబడి వస్తాయి. నాగపురి గ్రామం తపాస్పల్లి రిజర్వాయర్ కింద ఉండడంతో అక్కడి నుండి నీళ్లు వస్తాయి. దీంతో గ్రామంలో సేంద్రియ ఎరువుల ద్వారా సాగుచేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఇక మార్కెట్ విషయానికి వస్తే మంచి డిమాండ్ ఉంది. బ్లాక్ రైస్ క్వింటాల్కు రూ.15వేల వరకు ధర వస్తున్నది. చిట్టి ముత్యాలు కిలోకు రూ.150 వరకు ధర ఉంటుంది, కుజిపటాలి, చింతలూరి తదితర రకాలకు చెందిన సన్నాలకు క్వింటాల్కు రూ. 7 వేల నుంచి రూ.10 వేల వరకు ధర పలుకుతున్నది. ఎకరానికి సుమారుగా 15 నుంచి 20 బస్తాల (75 కిలోల సంచి) ధాన్యం వస్తున్నది. వరి గడ్డిని పశువులు చాలా చక్కగా తింటున్నాయి.
గ్రామంలోనే విత్తన బ్యాంకు ఏర్పాటు…
నాగపురి గ్రామంలో విత్తన బ్యాంకును ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని రైతులకే కాకుండా పరిసర గ్రామాల రైతులకు విత్తనాలను ఇస్తున్నారు. నాగుల పద్ధతిలో విత్తనాలను రైతులకు అందిస్తున్నారు. గ్రామానికి చెందిన ఎంపీపీ కరుణాకర్, గ్రామ సర్పంచ్, ఇతర గ్రామ పెద్దలు అందరూ కలిసి కట్టుగా సేంద్రియ పద్ధ్దతిలో సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు.
కుజిపటాలి,
చిట్టి ముత్యాలు సాగుచేశాం..
వానకాలంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో చిట్టి ముత్యాలు సాగుచేశా. ప్రస్తుతం కుజిపటాలి సాగుచేశా. భార్యాభర్తలం ఇద్దరం కష్టపడి పనిచేస్తాం. సేంద్రియ సాగు చేయడానికి ప్రధాన కారణం మా అమ్మ షుగర్ వ్యాధిగ్రస్తురాలు. ఆమె కొంత కాలంగా బాధపడుతున్నది. చిట్టిముత్యాలు, బ్లాక్రైస్, కుజిపటాలి రకాలకు చెందిన రైస్ తినడంతో షుగర్ అదుపులో ఉంటుందని తెలుసుకొని మొదట అర ఎకరం సాగుచేశా. ఈ బియ్యం మా అమ్మకు తినిపించడంతో షుగర్ పూర్తిగా అదుపులో ఉంది. ఎలాంటి ఇబ్బంది లేదు. దీంతో కుజపటాలి, చిట్టిముత్యాల రకాలకు చెందిన వంగడాలను సాగుచేస్తున్నా. పూర్తిగా సహజసిద్ధ్దంగా పంటల దిగుబడిని తీస్తున్నాను. తొలుత ఆవుపేడ మాత్రమే పొలంలో వేస్తున్నా. వరిలో కలుపు ఇతర పనులన్నీ భార్యాభర్తలం చేసుకుంటాం. మా గ్రామానికి చెందిన తిరుపతి అవగాహన కల్పించారు.
-కరుణాకర్, ఎంపీపీ చేర్యాల, సిద్దిపేట జిల్లా
ఆరెకరాల్లో 56 రకాల సాగు..
మా నాన్న కొంతకాలం కిందట క్యాన్సర్తో చనిపోయాడు. మా నాన్నకు ఎలాంటి దురాలవాట్లు లేకపోయినప్పటికీ ఎలా చనిపోయారని వైద్యులను అడిగాను. రసాయనాలతో సాగుచేసిన ఆహారం తినడంతో ఇలాంటి వ్యాధులు వస్తున్నాయని వారు చెప్పారు. ఆ మాటలతో ఎంతో ఆవేదనకు గురయ్యా. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చా. రసాయనాలతో కాకుండా సేంద్రియ పద్ధ్దతిలో సాగుచేసే వంగడాలు దీనికి పరిష్కారం అని భావించా. ఆ దిశగా ప్రయత్నం మొదలు పెట్టా. ‘భారత్ బీజ్ స్వరాజ్’ అనే సంస్థ నుంచి దేశీ వంగడాలను సేకరించి మా పొలంలో సాగుచేశా. ప్రస్తుతం నా మిత్రుడు అజిత్ సహాయంతో 6 ఎకరాల్లో 56 రకాల వంగడాలను సాగుచేశాం. ఎంపీపీ, సర్పంచ్, గ్రామస్తుల అందిరి సహకారంతో గ్రామంలోని రైతులకు సేంద్రియ సాగు విధానంపై అవగాహన కల్పించాం. ఇప్పుడు మా గ్రామంలో 30 మందికి పైగా సేంద్రియ సాగుచేస్తున్నారు. గ్రామంలో విత్తన బ్యాంకు ఏర్పాటు చేసి రైతులకు ఇస్తున్నాం.