సిద్దిపేట, జూన్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశీయ మార్కెట్లో ఆయిల్ పామ్ సాగుకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఈ పంటను సాగుచేసేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి తొలిసారి సిద్దిపేటలో ఈ పంట సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు. ఆర్థ్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఈ పంట సాగుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇటీవల నంగునూరు మండలం రామచంద్రాపూర్లో ఆయిల్పామ్ సాగును ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఆన్లైన్లో 170 మందికి పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి ఆయకట్టు సుమారుగా 750 ఎకరాల పైనే ఉంటుంది. నంగునూరు మండ లం నర్మెటలోనే ఆయిల్పామ్ పరిశ్రమను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. పరిశ్రమ ఏర్పాటుకు 105 ఎకరాల స్థలాన్ని సైతం అధికారులు సేకరించారు. సిద్దిపేట జిల్లాలో సాగుకోసం ‘3ఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవే ట్ లిమిటెడ్ కంపెనీ’కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఆయిల్ పామ్ సాగులో ప్రాసెసింగ్ అనుభవం, పెట్టుబడి సామర్ధ్యం గల కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది. సిద్దిపేట జిల్లాలో సుమారుగా 50వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడాది 3వేల ఎకరాల్లో సాగు చేయనున్నారు. తొలి విడుతగా వానకాలంలో వెయ్యి ఎకరాలు, దసరా తర్వాత 2 వేల ఎకరాలు, వచ్చే ఏడాది 7 వేల ఎకరాలు సాగుచేసేలా ప్రణాళికలు సిద్ధ్దం చేశారు. జిల్లాలో ఆయిల్పామ్ సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. ములుగు, రంగనాయక సాగర్ వద్ద రెండు నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కలను పెంచుతున్నారు.
రైతుకు ప్రతినెలా ఆదాయం…
బహుళ వార్షిక పంటల్లోకెల్లా పామాయిల్ ఎక్కువ దిగుబడినిస్తుంది. ఇది ఎకరానికి 10-12 టన్నులు 30 సంవత్సరాల వరకు దిగుబడిని ఇచ్చి రైతుకు నిరంతర ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇటు రైతుకు, పర్యావరణానికి మేలు కలిగించేదిగా ఆయిల్పామ్ పంట పేరు గాంచింది. ఈ పంటలకు చీడ పురుగులు, కోతులు, రాళ్ల వాన బెడద తక్కువగా ఉంటుంది. నేరుగా కంపెనీలు వచ్చి పంటను కొనుగోలు చేస్తాయి. రైతు ప్రతినెలా లాభదాయకమైన ఆదాయాన్ని పొందవచ్చు. పామాయిల్ను మన దేశంలో అధికంగా బేకరీ ఉత్పత్తుల తయారీకి, గృహ అవసరాలకు వినియోగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఉప ఉత్పత్తుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. బయోడీజిల్, ముల్చింగ్కు ఉపయోగపడతాయి. పామాయిల్ సాగు పర్యావరణానికి మేలు చేస్తుంది. ఒక ఎకరా వరి సాగుకు అవసరమైన నీటితో 4 ఎకరాల పామాయిల్ పంటను సాగు చేయవచ్చు. పంట వేసిన నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి 8-10 టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడితో, సుమారు రూ.80 వేల నుంచి లక్ష వరకు, 30 సంవత్సరాల వరకు ఏటా నిరంతర ఆదాయం పొందవచ్చు. ఆయా ప్రాంతాలకు కేటాయించబడిన కంపెనీల ద్వారా మొక్కలు, మొదటి నాలుగు సంవత్సరాలు ఎరువులు సరఫరా చేస్తారు. దిగుబడి సమయంలో ప్రభుత్వం నిర్ణయించబడిన ధర ప్రకారం కంపెనీలచే గెలలు కొని రైతుల ఖాతాలో పక్షం రోజులకోసారి డబ్బులు జమచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నది. పామాయిల్ పెట్టే రైతులకు సబ్సిడీపై డ్రిప్ను అందిస్తున్నది. రైతుల కోసం నాలుగు రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తున్నది. గుంత, ఎరువు, డ్రిప్, వాచ్ అండ్ వార్డు కింద కూలీ తదితర సౌకర్యాలను కల్పిస్తున్నది.
ఏటా రూ.90 వేల కోట్ల పామాయిల్ దిగుమతి…
భారత వంట నూనె పరిశ్రమ అమెరికా, చైనా, బ్రెజిల్ తర్వాత నాలుగో అతి పెద్ద పరిశ్రమ. అందులో పామాయిల్ ఒకటి. మలేషియా, ఇండోనేషియా దేశాలు కలిపి 85 శాతం క్రూడ్ పామాయిల్ను పండిస్తున్నాయి. పామాయిల్కు సంబంధించి చూస్తే 9లక్షల మిలియన్ టన్నుల నూనెను ఇండోనేషియా, మలేషియా, తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఏటా దేశంలో రూ.90 వేల కోట్ల పామాయిల్ను విదేశాల నుంచి కొనుక్కుంటున్నాం. ఇలా కొనుక్కోవడంతో విదేశీ మారక ద్రవ్యాన్ని కోల్పోతున్నాం. పామాయిల్ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మన దేశంలో 8,25,000 హెక్టార్లలోనే సాగవుతున్నది. మన దేశ అవసరాలకు సరిపడా పామాయిల్ ఉత్పత్తి చేయాలంటే ఇంకా 70 లక్షల ఎకరాల్లో పామాయిల్ తోటలు సాగు చేయాలి. మనదేశంలో వరి ఇబ్బడి ముబ్బడిగా పండిస్తున్నారు. నూనెగింజల పంటలు తక్కువయ్యాయి. పరిస్థితులకు అనుగుణంగా రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే లాభాలను ఆర్జించవచ్చు. మన రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంటను సాగు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో సాగుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెంలో 48 వేల ఎకరాల్లో మాత్రమే సాగుచేస్తున్నారు.
అంతర పంటలతో అదనపు ఆదాయం…
ఆయిల్పామ్లో అంతర పంటలైన కూరగాయలు, అల్లం, మిల్లెట్స్, వంటి పంటల సాగుతో ఎకరానికి రూ. 30 వేల వరకు ఆదాయం పొందవచ్చు. కంచె వెంబడి వెదురు/మలబార్ వేప పంట ద్వారా నాలుగో సంవత్సరం నుంచి ఎకరానికి రూ.40 వేల వరకు సుమారు 30ఏండ్ల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు. కంచె వెంబడి రెండో వరుసలో శ్రీగంధం మొక్కల పెంపకడంతో 15 ఏండ్ల తర్వాత ఎకరానికి సుమారుగా రూ.50 లక్షలకు పైగా అదనపు ఆదాయం పొందవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిత కార్యక్రమం ‘నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ – ఆయిల్ పామ్’ ద్వారా అమలు చేస్తున్నారు. ఎకరా ఆయిల్పామ్ సాగుకు మొదటి నాలుగు సంవత్సరాలకు గాను సుమారు రూ.60 వేలు నుంచి రూ. 70 వేల వరకు (సూక్ష్మ సేద్యం, ఇతర కూలీ ఖర్చులతో కలిపి) ఖర్చవుతుంది. నాలుగో సంవత్సరానికి గాను రూ. 30.800 వరకు ప్రభుత్వం ద్వారా రాయితీ లభిస్తుంది. కేటాయించబడిన కంపెనీల ద్వారా రైతులకు మొక్కలు, మొదటి నాలుగు సంవంత్సరాల పాటు ఎరువులు సరఫరా చేస్తారు. సంవత్సరం పొడవునా నీటి సౌకర్యం ఉన్న రైతులందరూ ఈ పంట సాగుచేయవచ్చు.