న్యాల్కల్, జూన్ 18 : నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం న్యాల్కల్, నాగల్గిద్ద మండలాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. న్యాల్కల్ మండల కేంద్రంతో పాటు చాల్కి గ్రామాల్లోని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. న్యాల్కల్లోని రాయల్ ఎరువులు, విత్తన విక్రయ దుకాణాన్ని జిల్లా వ్యవసాయ టాస్క్ఫోర్స్ ఏడీఏ శ్రీనివాసప్రసాద్ తనిఖీ చేశారు. దుకాణంలో ఎరువులు, విత్తనాలు, రిజిస్టర్లు, స్టాక్ రికార్డులను పరిశీలించారు. ఎరువులు, విత్తనాలకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేకపోవడంతో దుకాణ నిర్వాహకుడికి స్టాక్సెల్ నోటీసును జారీ చేశారు. స్టాక్కు సంబంధించిన పూర్తి రికార్డులు రెండు రోజుల్లో అందజేయాలని ఆదేశించారు. అనంతరం చాల్కి గ్రామంలోని శ్రీసాయి, సిద్ధేశ్వర ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాల ఎదుట ఎరువులు, విత్తనాల స్టాక్, ధరల వివరాల బోర్డులను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట జహీరాబాద్ ఏడీఏ భిక్షపతి, మండల వ్యవసాయాధికారి లావణ్య ఉన్నారు.
రాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక నిఘా
నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఏడీఏ కరుణాకర్రెడ్డి అన్నారు. మండలంలో నాగల్గిద్ద, కరస్గుత్తి గ్రామాల్లో ఫర్టిలైజర్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఆయా దుకాణాల్లో రిజిస్టర్లు, విత్తనాల ప్యాకెట్లు, స్టాక్ బోర్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు అక్రమ రవాణా చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఉన్నారు.