సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 18: ఆధునిక హంగులతో నిర్మాణమైన సిద్దిపేట కలెక్టరేట్ భవన సముదాయాన్ని రేపు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవిస్తో కలిసి పర్యవేక్షించారు. కలెక్టరేట్లోని అన్నీ బ్లాక్ల్లోకి కలియతిరుగుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, కలెక్టరేట్ ఆవరణ ప్రాంగణంలో పెద్దఎత్తున పచ్చదనంతో నింపేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టరేట్ సముదాయాన్ని మొత్తం ఆకట్టుకునేలా విద్యుత్తుదీపాలతో అలంకరిస్తున్నారు. వివిధ శాఖలకు కేటాయించిన బ్లాక్ల్లో అధికారులు తగిన ఫర్నిచర్, ఫైల్స్ సిద్ధం చేసుకొని, ప్రారంభోత్సవం నాటి నుంచి తమ కార్యకలాపాలను కొనసాగించేందుకు తగు ఏర్పాట్లను పూర్తి చేశారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి నేతృత్వంలో ప్రారంభోత్సవ నిర్వహణకు బ్లాక్ల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు.
జీ+1 పద్ధతిలో సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్..
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నిర్మించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సిద్దిపేటలో రూ.4 కోట్లతో సకల హంగులతో క్యాంపు కార్యాలయం నిర్మించారు. ఈ భవనాన్ని రేపు సీఎం కేసీఆర్ ప్రారంభించానున్నారు. జీ+1 విధానంలో నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో కాన్ఫరెన్స్హాల్, వెయిటింగ్హాల్, ఎమ్మెల్యే చాంబర్, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుల హాల్, రెస్ట్ రూంలను నిర్మించారు. మొదటి అంతస్తులో వెయిటింగ్ హాల్, డైనింగ్ రూమ్, లివింగ్రూంలతో పాటు మాస్టర్ బెడ్రూమ్లను నిర్మించారు. విశాలమైన పార్కింగ్తో పాటు, సమావేశాలు నిర్వహించుకోవడానికి వీలుగా బయట మీటింగ్ హాల్ను ఏర్పాటు చేయనున్నారు. కార్యాలయంలో భద్రతాపరమైన విషయాలను మానిటరింగ్ చేయుటకు వీలుగా సీసీ కెమెరాలను, కార్యాలయం వెనుక భాగంలో గార్డెన్ను ఏర్పాటు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 20న ఈ భవనాన్ని ప్రారంభించనుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఏర్పాట్లను పరిశీలించారు.
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి:ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా ఉండాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సముదాయాన్ని ఆయన పరిశీంచారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్, సామగ్రిని కేటాయించిన స్పేస్లోకి యుద్ధ ప్రాతిపదికన తరలించాలన్నారు. పాలనా సౌలభ్యం కోసమే ఒకేదగ్గర అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆయనవెంట సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, డీఆర్వో చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.