హుస్నాబాద్, మే 18 : డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాల్లో ఇప్పటి వరకు 6లక్షల 70వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు జరిగాయని ఆర్డీవో జయచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం హు స్నాబాద్లోని ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న కొనుగోలు కేంద్రాన్ని ఏసీపీ మహేందర్తో కలిసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాక్డౌన్ ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో డివిజన్లో నిరాటంకంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేవడం చాలా వరకు తగ్గిందని, త్వరలోనే కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. రైతులకు సరిపడా గన్నీ సంచులతోపాటు ధాన్యాన్ని తరలించడానికి వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు వెంటనే బ్యాంకు ఖాతాల్లో జమవుతున్నాయన్నారు. వీరి వెంట ఆర్ఐ వెంకటేశ్, పోలీసు సిబ్బంది ఉన్నారు.
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి..
దుబ్బాక, మే18 : రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి గోపాల్రావు సూచించారు. దుబ్బాక మండలం చిట్టాపూర్లో కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో ధాన్యం కొనుగోలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై ఎంపీడీవో భాస్కారాచారి, సర్పంచ్ రాజయ్యతో మాట్లాడారు. పక్క గ్రామాల నుంచి హమాలీలను రప్పించి కొనుగోలు వేగవంతం చేసేలా చూడాలన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన..
దుబ్బాక మండలం చౌదర్పల్లి, ఎనగుర్తి, ఆకారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఏసీఎస్ చైర్మన్ కైలాశ్, నాయకులు కొత్త కిషన్రెడ్డి, బండి రాజు సందర్శించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేపట్టాలని సూచించారు.
ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది..
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీఆర్డీఏ పీడీ గోపాల్రావు అన్నారు. మంగళవారం మిరుదొడ్డి మండల పరిధిలోని మోతె గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ధాన్యం కొనుగోలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పీడీ గోపాల్రావు మాట్లాడారు. రైతులు సెంటర్కు తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటాను నిర్వహించి సెంటర్ నుంచి రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అధికారులు, వార్డు సభ్యులు, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లను వేగిరం చేయాలి..
తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను ఐకేపీ, పీఏసీఎస్ అధికారులు వేగిరం చేయాలని చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్ కోరారు.
రైతుల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం..
కరోనా మహమ్మారితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పటికీ సీఎం కేసీఆర్ రైతులపై ఉన్న మమకారంతో గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేయిస్తున్నారని ఎంపీపీ కరుణాకర్ అన్నారు. మండలంలోని పెదరాజుపేట, పోతిరెడ్డిపల్లి, వేచరేణి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ గీయాసున్నీసాబేగంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి పని చేసుకోవాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్లు నూనె వెంకట్, కత్తుల కృష్ణవేణీశ్రీనివాస్రెడ్డి, ఏనుగుల దుర్గయ్య తదితరులున్నారు.
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం..
రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పీఏసీఎస్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని లద్నూర్, సలాఖపూర్ గ్రామాల్లో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ నరేందర్తో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు గతంలో కంటే అధికంగా ధాన్యం వస్త్తుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు వంగ భాస్కర్రెడ్డి, సర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ సమ్మయ్య, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ ఐలయ్య పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం..
రైతులు పండించిన ధాన్యం విక్రయించే కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కృషి చేస్తున్నట్లు డీఆర్డీఏ డీపీఎం రాజయ్య అన్నారు. మండలంలోని అనాజీపూర్, మంతూర్, కొత్తపల్లి, రాయపోల్లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి, రైతులతో కొనుగోలు జరుగుతున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట ఏపీఎం దుర్గప్రసాద్ తదితరులు ఉన్నారు.