సిద్దిపేట అర్బన్, జూన్ 17 : వరి సాగులో వెదజల్లె పద్ధతి పాటిస్తే పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా దిగుబడి అధికంగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి పరశురాంరెడ్డి అన్నా రు. మండలంలోని ఎన్సాన్పల్లి రైతువేదికలో ఎన్సాన్పల్లి, తడకపల్లి గ్రామ రైతులకు గురువారం వెదజల్లె పద్ధతిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాధారణ పద్ధతితో పోలిస్తే వెదజల్లె పద్ధతి తో ఎకరానికి రూ.12 నుంచి రూ.14 వేల పెట్టుబడి తగ్గుతుందని, 2 నుంచి 3 క్వింటాళ్ల అధిక దిగుబడి వస్తుందన్నారు. సకాలంలో వరిసాగుకు వెదజల్లె పద్ధతి శ్రేయస్కరమన్నారు. ఆయిల్ పామ్ తోట లు, పట్టు పురుగుల పెంపకం చేపట్టి, రైతులు అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చన్నారు. నేలల్లో భాస్వరం నిల్వలను సమర్థవంతంగా పంటకు అందించడానికి ఫాస్పరస్ సాల్యూబులైజింగ్ బ్యాక్టీరియా ద్రావకాన్ని వాడాలని సూచించారు. 65 శాతం సబ్సిడీపై ప్రభుత్వం ఇచ్చే పచ్చిరొట్ట పంటలతో ఎకరాకు సుమారు ఒక బస్తా యూరియా వినియోగాన్ని తగ్గించవచ్చని వివరించారు. రైతుబంధు కోసం కొత్తగా పట్టాపుస్తకాలు పొం దిన రైతులు బ్యాంకు వివరాలను ఏఈవోలకు అందజేయాలని సూచించారు. సదస్సులో సెరికల్చర్ ఆఫీసర్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభాకర్వర్మ, ఎంపీటీసీ అంబటి శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నిమ్మ జనార్దన్రెడ్డి, సభ్యుడు సిద్దారెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు.
ఆయిల్పామ్, మల్బరీ సాగు చేపట్టాలి
మండలంలోని బద్దిపడగ గ్రామం లో రైతులకు వరిలో వెదజల్లే పద్ధతి, ఆయిల్పామ్, పట్టు పురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ.. రైతులందరూ సులభ పద్ధతిలో పంటలను సాగు చేయాలని సూచించారు. ఆయిల్పామ్, మల్బరీ సాగు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో గీత, ఏఈవో అశోక్, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్గౌడ్, మహిపాల్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, గ్రామ అధ్యక్షుడు నారాయణరెడ్డి పాల్గొన్నారు.
10 రోజుల ముందుగానే పంట కాలం..
రైతులు వెదజల్లే పద్ధ్దతిలో వరిని సాగు చేస్త్తే తక్కువ ఖర్చుతో పాటు అధిక దిగుబడి వస్తుందని తోర్నాల వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ పల్లవి అన్నారు. మండలంలోని బూరుగుపల్లిలో రైతులకు వరిలో వెదజల్లే పద్ధ్దతిపై అవగాహన కల్పించారు. వెదజల్లే పద్ధ్దతిలో ఎకరానికి 12 కిలోల విత్తనాలు సరిపోతాయని, పంటకాలం 10 రోజుల ముందుగానే వస్తుందన్నారు. కార్యక్రమంలో ఏవో నాగరాజు, సర్పంచ్ విజయవర్ధన్రెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ అశోక్రెడ్డి, కోఅప్షన్ సభ్యుడు అబ్దుల్, ఏఈవో నర్సింహులు పాల్గొన్నారు.
నూతన పద్ధతుల్లో సాగు చేయాలి
వరిలో పాత పద్ధ్దతులు కాకుండా నూతన పద్ధతుల్లో సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి సకలేశ్ సూచించారు. వెదసాగు పద్ధతి (విత్తనాలను చల్లే పద్ధ్దతి) అనుసరించి వరిని సాగుచేయాలన్నారు. వర్గల్ రైతువేదిక భవనంలో క్లస్టర్ స్థాయి రైతులతో వెద సాగుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఏఈవోల సూచనలు పాటించి వరిలో సస్యరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ బాలమల్లు, ఏఈవోలు సంపత్కుమార్, లక్ష్మణ్, ధర్మేందర్, సంతోశ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు, సభ్యులు పాల్గొన్నారు.
ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి
ప్రభుత్వం సూచిస్తున్న వెదజల్లే పద్ధతితో చేపట్టే వరిసాగు రైతుకు మేలు జరుతుందని తోర్నాల వ్యవసాయ పరిశోదన స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ పల్లవి అన్నారు. గురువారం మండలంలోని మర్రిముచ్చాలలో ఏవో నరేశ్ ఆధ్వర్యంలో వెదజల్లే పద్ధతిపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. వెదజల్లే పద్ధతితో రైతుకు పెట్టుబడి ఎకరానికి రూ.10వేల వరకు తగ్గుతుందన్నారు. అదే విధంగా ఒక వారం ముందే పంట కోతకు రావడంతో పాటు ఎకరానికి 28 నుంచి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు. సదస్సులో సర్పంచ్ బొడిగం పద్మ, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్ తలారి యాద య్య, రైతులు దేవెందర్రెడ్డి, అభినవ్ పాల్గొన్నారు.