సిద్దిపేట, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.59 కోట్ల 85 లక్షలతో చేపట్టనున్న సమీకృత వెజ్ -నాన్వెజ్ మార్కెట్ల కాంప్లెక్స్లు, రూ. 20 కోట్ల 25 లక్షలతో నిర్మించనున్న వైకుంఠధామాలకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నూతన సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ల కాంప్లెక్స్లు, వైకుంఠధామాల నిర్మాణాలు చేపట్టనున్నామని వివరించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూస్తామని మంత్రి చెప్పారు. సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ సముదాయాలు నిర్మాణంతో ఇక నుంచి రోడ్లు, కాలిబాటల పక్కన, ఎక్కడపడితే అక్కడ మాంసం, కూరగాయల అమ్మకాలు చెల్లవని మంత్రి స్పష్టం చేశారు. ఈ మార్కెట్ సముదాయాలు కొనుగోలుదారులకు, అమ్మకందారులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం ప్రజల ఇక్కట్లను దృష్టిలో పెట్టుకొని అధునాతన సౌకర్యాలతో నిర్మించతల పెట్టిందన్నారు. మనిషి అంతిమయాత్ర గౌరవంగా జరిగేలా వైకుంఠధామాలను నిర్మిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో సమీకృత వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ సముదాయాలు, వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్లకు సూచించారు. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు.