సిద్దిపేట జోన్, మే 17 : కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వ విధించిన లాక్డౌన్ సిద్దిపేట నియోజక వర్గంలో పక్కగా అమలవుతోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంతోపాటు సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలాల్లో పటిష్టంగా లాక్డౌన్ కొనసాగుతున్నది. ప్రజలు ఉదయం 6 నుంచి 10 గంటల లోపు తమకు కావాల్సిన సరుకులు, కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఇండ్లకు వెళ్లిపోయారు. ఉదయం మార్కెట్లన్నీ సందడి కనిపించగా 10 గంటల తరువాత లాక్డౌన్ అమలులోకి రాగానే ప్రధాన రోడ్లతో పాటు చిన్న వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. లాక్డౌన్ సమయాలను ప్రజలు పాటిస్తుండడంతో సిద్దిపేటతో పాటు మండలాల్లో సాఫీగా లాక్డౌన్ కొనసాగుతుంది.
అవగాహన కల్పిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు..
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. లాక్డౌన్ మినహాయింపు సమయాల్లో జనం రోడ్లపైకి వచ్చినప్పుడు తప్పకుండా మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచనలు చేస్తున్నారు. గుంపులుగా ఉండకుండా దూరం పాటించాలన్నారు. కొనుగోళ్ల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరని సూచిస్తున్నారు. కూరగాయలు విక్రయించేందుకు మల్టీపర్పస్ హైస్కూల్ మైదానం, డిగ్రీ కళాశాల మైదానాలను కేటాయించి విశాలమైన ప్రదేశంలో విక్రయాలు జరిగేలా చూస్తున్నారు. ఆయా వార్డులలో శానిటైజేషన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పోలీసుల బందోబస్తు..
లాక్డౌన్ అమలులోకి రాగానే పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరూ కూడా రోడ్లపైకి రాకుండా నిలువరిస్తున్నారు. అనవసరంగా వస్తున్న వారిపై కేసులు నమో దు చేస్తున్నారు. అత్యవసరం ఉన్నవారిని పంపిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో పికెట్ ఏర్పాటు చేసి జనం రోడ్లెక్కకుండా చూస్తున్నారు. దవాఖానలకు వెళ్లే వారిని పంపించేస్తున్నారు.