వర్గల్, మే 17 : కరోనా ఉధృతిలో కూడా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. రైతులకు ఆసరాగా ఉండాలనే లక్ష్యంతో వర్గల్ మండలంలో 8 వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. సోమవారం మండలకేంద్రం వర్గల్లోపాటు శాకారం, నెంటూర్, తున్కిఖల్సా, మజీద్పల్లి, మైలారం, వేలూర్ తదితర గ్రామాల్లోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల కష్టం వృథాగా పోవద్దనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోళ్లు చేసే విధంగా ఏర్పాట్లు చేశారని తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించి తూకాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వాణిరెడ్డి, ఏవో సకలేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దేగనిక నాగరాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లతో రైతులకు భరోసా
కరోనా విపత్తులోనూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తూ ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తుందని ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్ అన్నా రు. గజ్వేల్లోని వ్యవసాయమార్కెట్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సంక్షోభంలోనూ రైతు లు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వమన్నారు. తుఫాన్ కారణంగా వర్షాలు కురుస్తున్నందునా రైతులు ధాన్యాన్ని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ సారి వరిసాగు విస్తీర్ణం భారీగా పెరిగిందని, అయినా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ధాన్యం కొనుగోలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. మార్కెట్లో క్వింటాల్ ధాన్యానికి ధర రూ. 1500 ఉండగా, ప్రభుత్వం రూ.1880 ధర ఇస్తుందన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ ధాన్యంలో తేమ తక్కువ ఉండేలా చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. ఆమె వెంట ఏఎంసీ కార్యదర్శి జాన్వెస్లీ, సూపర్వైజర్ మహిపాల్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
రైతులు అధైర్య పడొద్దు..
రైతులు ఎవరూ అధైర్యపడొడు.. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ నల్ల నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం సిద్దిపేట మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ప్రతి గింజనూ కొనేలా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు చర్యలు చేపట్టారని తెలిపారు. కొనుగోలు కేంద్రంలో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఆయన వెంట 1వ వార్డు కౌన్సిలర్ విజయేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
తడిసిన ధాన్యం తరలించేలా చర్యలు తీసుకుంటాం..
వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైస్మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంటామని నంగునూరు పీఏసీఎస్ చైర్మన్ కోలా రమేశ్గౌడ్ అన్నారు. సోమవారం మండలంలోని అక్కెనపల్లి (ఆరెపల్లి), కొండంరాజుపల్లి, ఘణపూర్ గ్రామాల్లోని వడ్ల కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి గీతతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యం విషయమై మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్లామని, రైస్మిల్లు యజమాన్యాలతో మాట్లాడి ధాన్యం దించుకునేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి, ఎంపీటీసీ బెదురు తిరుపతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రైతులకు అందుబాటులో ఎరువులు
పంటల సాగుకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ముందస్తుగా ఎరువులు అందుబాటులో ఉంచామని పీఏసీఎస్ చైర్మన్ రమేశ్గౌడ్ అన్నారు. మండలకేంద్రం నంగునూరుతోపాటు సిద్దన్నపేట, గట్లమల్యాల గ్రామాల్లో ఎరువులను గోదాములో కూలీలతో నిల్వ చేయించారు. ఆయన వెంట వైస్ ఎంపీపీ రేణుకావేణుగోపాల్ ఉన్నారు.