సిద్దిపేట జిల్లాలో 50లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం
సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 16: మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో హరిత సిద్దిపేట జిల్లాగా మార్చేందుకు ఈ సారి పెద్దుఎత్తున్న మొక్కలు నాటేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. జిల్లావ్యాప్తంగా ప్రతీ పల్లెను పచ్చదనంతో నింపేందుకు ఊరురా నర్సరీలను ఏర్పాటు చేశారు. పీఆర్, డీఆర్డీవో పథకం ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నర్సరీల నిర్వహణ కొనసాగుతున్నది. అధికారుల పర్యవేక్షణలో తీరొక్క పూల, పండ్ల, నీడనిచ్చే మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచుతున్నారు. ఏడో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాను హరితమయంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సుమారుగా 50 లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆయా నర్సరీల్లో 60లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచారు. పల్లెపల్లెనా కనీసం 10 వేల నుంచి 30 వేల వరకు మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
489 నర్సరీలు.. 60లక్షల మొక్కలు..
జిల్లావ్యాప్తంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులు, ఖాళీ స్థలాలు మేరకు జిల్లాలోని 489 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఇందుకు కనీసం 10 వేల నుంచి గరిష్ఠంగా లక్ష వరకు మొక్కలను కంటికి రెప్పలా పెంచుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడో విడుత హరితహారంలో 50 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. నర్సరీల నిర్వహణపై అధికారులు పర్యవేక్షణ నిరంతరం సాగుతున్నది.