అప్పటి వరకు ఉరుకులు, పరుగులు.. బస్తీలు, కాలనీలు, ప్రధాన కూడళ్లు, రహదారుల్లో వాహనాల రాకపోకలతో సందడే సందడి…. సూపర్మార్కెట్లు, కిరాణాషాపులు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు…ఇలా అన్ని వ్యాపార కేంద్రాల్లో జనసందోహమే.. సమయం ఉదయం 10 గంటలు.. హడావిడిగా దుకాణాల మూత.. రహదారులన్నీ నిర్మానుష్యం…నాలుగు గంటల పాటు జన సంచారంతో కిటకిటలాడిన రోడ్లన్నీ బోసిపోయాయి. తెరిచిన షాపులన్నీ మూతబడ్డాయి. బస్సులు డిపోలకు తరలిపోయాయి. మూడోరోజూ లాక్డౌన్ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కఠినంగా అమలైంది. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. స్వీయ నిర్బంధం పాటించారు. నిబంధనలను అనుసరించి.. నిర్దేశించిన సమయం తర్వాత ఇంటికే పరిమితమయ్యారు. ఇంటిల్లిపాది కుటుంబసభ్యులతో గడిపారు.
సిద్దిపేట జోన్, మే 14 : ప్రభుత్వం కరోనాను నియంత్రించేందుకు విధించిన లాక్డౌన్ మూడోరోజూ సంపూర్ణంగా కొనసాగింది. ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్కు సహకరించారు. ఉదయం 10 గంటల వరకు మార్కెట్లలో నిత్యావసర సరుకుల దుకాణాల తెరిచి ఉండడంతో ప్రజలు మార్కెట్లకు వెళ్లి తమకు కావాల్సిన సరుకులను తీసుకున్నారు. 10 గంటల తర్వాత పట్టణంలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రజలందరూ తమ ఇండ్ల వద్దే ఉంటూ కరోనాను అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారికి పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
పోలీసులు పర్యవేక్షణ..
లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలు చేసేందుకు పోలీసులు పట్టణంలో పికెటింగ్లు ఏర్పాటు చేసి రోడ్లపై తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానాలు వేస్తున్నారు. పోలీసులు నిత్యం పహారా కాస్తూ లాక్డౌన్ కట్టుదిట్టంగా అమలయ్యేలా చూస్తున్నారు.
లాక్డౌన్ ప్రశాంతం..
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగింది. శుక్రవారం మూడోరోజూ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే వ్యాపారులు దుకాణాలు తెరువగా, ప్రజలు కావాల్సిన నిత్యావసరాలను కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటల తరువాత వ్యాపార సముదాయాలు మూసివేశారు. దీంతో అప్పటివరకు జన సంచారంతో కిటకిటలాడిన మార్కెట్లు, రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రాందాస్ చౌరస్తా, హెడ్ పోస్టాఫీస్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా బయటకు వచ్చిన వారిని హెచ్చరిస్తూ వెనక్కి పంపిస్తున్నారు. లాక్డౌన్ నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
లాక్డౌన్కు సహకరించాలి…
లాక్డౌన్ సమయంలో ప్రజలందరూ ఇండ్ల నుంచి బయటికి రావొద్దని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరి సూచించారు. లాక్డౌన్తో మనల్ని మనం కాపాడుకునేందుకు తీసుకున్న తప్పనిసరి చర్యగా భావించాలని పట్టణ ప్రజలను కోరారు. సడలింపు సమయంలో మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించి నిత్యావసరాలను తీసుకోవాలన్నారు.
సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా
తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి అనుమతి ఇవ్వాలని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి 65వ జాతీయ రహదారిపై మాడ్గి చౌరస్తా, న్యాల్కల్ మండలంలోని బీదర్ సరిహద్దులో ఉన్న గణేశ్పూర్ శివారులో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తనిఖీ చేసి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. మహారాష్ట, కర్ణాటక వైపు నుంచి వచ్చే వాణిజ్య, నిత్యావసర సరుకులు రవాణా చేసే వాహనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోకి వచ్చే అంబులెన్స్లు ముందు ప్రభుత్వ అనుమతి తీసుకుని రావాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం రాష్ట్ర సరిహద్దులో రెండు చెక్పోస్టులు ఏర్పాటు చేసిందన్నారు. చెక్పోస్టుల వద్ద 24 గంటల పోలీసులు విధినిర్వహణలో ఉంటున్నారని, ఇతర రాష్ట్రల నుంచి వచ్చే వాహనాలు తనిఖీ చేసి రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. చెక్పోస్టు వద్ద వాహనాల వివరాలు నమోదు చేసే రిజిష్టర్ పరిశీలించారు. ఎస్పీ వెంటనే జహీరాబాద్ డీఎస్పీ జి.శంకర్రాజు, సీఐలు రాజశేఖర్, నాగేశ్వర్రావు, చెరాగ్పల్లి, హద్నూర్ ఎస్ఐలు కాశీనాథ్, విజయ్రావుతో పాటు పలువురు ఉన్నారు.
లాక్డౌన్లో రోడ్లపైకి వచ్చే వాహనాలు సీజ్ చేస్తాం..
లాక్డౌన్ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేస్తామని సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సదాశివపేట పట్టణంలో లాక్డౌన్ పరిస్థితులను డీఎస్పీ బాలాజీతో కలిసి పరిశీలించారు. రోడ్లపైకి వచ్చిన వాహనదారులతో ఎందుకు వస్తున్నారంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ సదాశివపేట పట్టణ, మండల పరిధిలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్నాయన్నారు. సంగారెడ్డి నియోజకవర్గంలోనే అత్యధికంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుందన్నారు. లాక్డౌన్ వల్ల కరోనాను నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చినందున 30 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సదాశివపేట పోలీసులు లాక్డౌన్ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట సీఐ సంతోష్కుమార్, ఎస్సైలు రవి, ప్రశాంత్, ఇతర పోలీసులు పాల్గొన్నారు.