జిల్లాలో 396 సెంటర్ల ఏర్పాటు
యాసంగిలో 2.83 లక్షల ఎకరాల్లో వరిసాగు
6,35,831 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా
తాలు, తేమ, మట్టి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత రైతులదే..
తేమ17శాతం మించొద్దు.. రైతులకు టోకెన్ పద్ధతి అమలు
విక్రయించిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1888, కామన్ రకానికి రూ.1868 మద్దతు ధర
సిద్దిపేట, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :సిద్దిపేట జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో సుమారుగా రూ.1600 కోట్ల విలువైన ధాన్యం పండిందని అధికారుల అంచనా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు రావడంతో రైతులు రికార్డు స్థాయిలో వరి సాగుచేశారు. దీనికి తోడు జిల్లాలో ఈసారి సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, చెక్డ్యాంలు నిండడంతో బోరుబావుల కింద వరిసాగు పెరిగింది. రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లతో పాటు తపాస్పల్లి రిజర్వాయర్, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, కూడవెల్లి, హల్దీవాగుల పరీవాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు వరి సాగుచేశారు. జిల్లాలో ఈ యాసంగిలో 2.83లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 6,35,831 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 499 గ్రామాలు, 24 మండలాలు ఉన్నాయి. జిల్లా, మండల కమిటీలతో పాటు రైతుబంధు గ్రామ సమితులు ఉన్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలులో వీరు చురుగ్గా పాల్గొనాలని సీఎం కేసీఆర్ సూచించారు. ధాన్యం కొనుగోళ్లను మహిళా సంఘాలు, వ్యవసాయ సహకార పరపతి సంఘాల ద్వారా సేకరిస్తారు. పెద్ద గ్రామాలైతే ఒకటి చొప్పున , చిన్న గ్రామాలైతే రెండు గ్రామాలు కలిపి ఒక కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
జిల్లాలో 396 కొనుగోలు కేంద్రాలు…
జిల్లాలో ధాన్యం సేకరణకు 396 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మహిళా సంఘాల ద్వారా 217, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 168, మార్కెట్ కమిటీల ద్వారా 7, మెప్మా ద్వారా 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నేటి నుంచి వారం రోజుల్లో అన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు. కాగా, జిల్లాకు 1,36,71,200 గన్నీ బ్యాగులు అవసరం కాగా, 53,52,168 సిద్ధ్దంగా ఉన్నాయి. బ్యాలెన్స్ 83,19,032 బ్యాగులను తెప్పిస్తున్నారు. టార్పాలిన్ కవర్లు 11,350 అవసరం ఉండగా, 10,430 సిద్ధ్దంగా ఉన్నాయి. ప్యాడీక్లీనర్స్ 708 గాను 641, మాశ్చర్ మీటర్స్ 621 గాను 565, వెయిట్ మిషన్స్ 749కి గాను 696 సిద్ధ్దంగా ఉన్నాయి. బ్యాలెన్స్గా ఉన్న వాటిని అధికారులు తెప్పిస్తున్నారు. ఏ-గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1888, కామన్ రకం ధాన్యం క్వింటాల్కు రూ.1868కు కొనుగోలు చేస్తారు. గత యాసంగికి ఇప్పటికి క్వింటాల్కు రూ. 53 ధర పెరిగింది. కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ప్యాడీక్లీనర్, తేమను కొలిచే పరికరం, బరువు తూచే మిషన్, గన్నీ బ్యాగులు, చైర్లు, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కల్పిస్తున్నారు. వేసవి, కరోనా దృష్ట్యా కేంద్రాల వద్ద చలివేంద్రాలు పెట్టడంతో పాటు అవసరం మేరకు టెంట్లు, శానిటేషన్, మాస్క్లు అందుబాటులో ఉంచుతున్నారు.
72 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ..
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ప్రతి మండలంలో ఒక ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షిస్తుంది. బృందంలో మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయ శాఖ అధికారి తదితరులు ఉంటారు. ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు పెద్ద ఎత్తున ధాన్యం రాకుండా రైతులకు టోకెన్ పద్ధతిని అమలు చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో టోకెన్ పద్ధ్దతిలో కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లుకు తరలించగానే, రైతుకు టక్ షీట్ వచ్చిన 72 గంటల్లోనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమవుతాయి. ఇందుకు సంబంధించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్రక్ షీట్లో వారి వివరాలను నమోదు చేసి వెంటనే అప్లోడ్ చేస్తారు. దీంతో వారికి చెల్లింపులు త్వరగా చేసే వీలు కలుగుతుంది.
తేమ శాతం 17కు మించరాదు..
వరి కోయగానే ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురాకుండా రైతులకు అధికార యంత్రాంగం పలు సూచనలు చేస్తున్నది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చే ముందు ఆరబోసి, తాలు, తేమ లేకుండా చూసుకోవాలని గ్రామాల్లో రైతులకు అధికారులు అవగాహన చేస్తున్నారు. తేమ శాతం 17కు మించరాదని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో పెట్టిన నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి రైతులు మద్దతు ధరను పొందాలని సూచిస్తున్నారు. నిర్వాహకులకు శిక్షణ ఇవ్వడంతో పాటు ధాన్యం సేకరణ, లోడింగ్ , రైస్ మిల్లులకు తరలింపు తదితర విదివిధానాలపై ప్రత్యేక దృష్టిని సారించారు. జిల్లాలో 53 రైస్ మిల్లులను ఎంపిక చేశారు.