అంబేద్కర్ బాటలో సీఎం కేసీఆర్ పయనం
రూ.130 కోట్లతో అతి పెద్ద విగ్రహం ఏర్పాటు
సొంతస్థలంలో ఇల్లు కట్టుకునేందుకు నిధులు
గజ్వేల్ రూరల్, ఏప్రిల్14: దళిత నిరుద్యోగుల అభున్నతి కోసమే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో దళిత ఎంపవర్మెంట్ పేరుతో రూ.1000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టిందని, త్వరలోనే పథకం ద్వారా అందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం పనిచేస్తున్నదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బీఆర్ అంబేద్కర్ 130వ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండలంలోని ధర్మారెడ్డిపల్లిలో విగ్రహావిష్కరణ చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.చిన్న రాష్ర్టాలతోనే అభివృద్ధి సాధ్యమని చేప్పింది డాక్టర్ బీఆర్ అంబేద్కరేనని, నూతనంగా ఏర్పాటైన తెలంగాణ అభివృద్ధిలో ముందువరసలో ఉందన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. అందరికీ సమానమైన ఓటు హక్కును కల్పించింది అంబేద్కర్ అని, నేడు మహిళలకు అన్నిరంగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నయంటే అనాడు అంబేద్కర్ రాజ్యాంగంలో రిజర్వేషన్ల ప్రస్తావన చేయడంతోనే అన్నారు. రాజ్యాంగాన్ని రచించిన మహానీయుడు, విభిన్న జాతుల, విభిన్న వర్గాలకు మూడంచెల వ్యవస్థను రూపకల్పన చేశారని కొనియాడారు. హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్బండ్పై రూ.130 కోట్లతో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఆయన జీవిత చరిత్రను తెలిపే విధంగా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నమన్నారు. అంబేద్కర్ బాటలోనే సీఎం కేసీఆర్ పయనిస్తూ, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ దేశాలకే ఆయన దిక్సూచి అన్నారు. ఎస్సీ కార్పొరేషన్, సబ్ స్లాన్ ల ద్వారా ఇచ్చేవి కాకుండా ఎంపవర్మెంట్ను ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టికునేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించామని, ఇందులో దళితులకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, ఏఎంసీ చైర్ పర్సన్ మాదాసు అన్నపూర్ణాశ్రీనివాస్, ఎంపీపీ అమరావతి, జడ్పీటీసీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, సర్పంచ్ సులోచన, వైస్ ఎంపీపీ కృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు బెండే మధు, నాయకులు పండరి రవీందర్రావు, రమేశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.