వర్గల్, ఏప్రిల్ 11: మహావిష్ణువు నాలుగో అవతారమైన నాచగిరి లక్ష్మీనృసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో తలమానికమైన స్వామివారి రథోత్సవం ఆదివారం కనుల పండువగా కొనసాగింది. ఉదయం అశేష భక్తజనం మధ్య పురవీధుల్లో లక్ష్మీసమేత మృగనారసింహమూర్తి ఊరేగారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పాలకమండలి చైర్మన్ హనుమంతరావు, ఈవో సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో కొవిడ్ నిబంధనలు అమలు చేశారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించేలా మైకుల ద్వారా అవగాహన కల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ధర్మసత్రాలు, విడిది కేంద్రాలు, ఆలయ పరిసరాల్లో భక్తుల కోలాహలం కనిపించింది.
గోదావరి జలాలతో స్నానాలు…
ఎన్నడూ లేనివిధంగా నాచగిరి రథోత్సవం సందర్భంగా హల్దీవాగుకు గోదావరి జలాలు తరలివచ్చాయి. దీంతో ఈసారి భక్తులు గోదావరి నీళ్లతో స్నానాలు ఆచరించే అవకాశం లభించింది. ఆదివారం వేకువజామునే వాగులో భక్తులు చన్నీటి స్నానాల సందడి మొదలైంది. భక్తులు కుటుంబ సమేతంగా హల్దీవాగు వద్దకు చేరి పవిత్ర గోదావరి స్నానాలు ఆచరించారు.
స్వామివారి సేవలో మంత్రి హరీశ్రావు…
రథోత్సవం సందర్భంగా ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదివారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు మంత్రికి పూర్ణకుంభంతో ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యులు స్వాగతం పలికారు. పూజల అనంతరం మంత్రిని శాలువాలతో సన్మానించి స్వామివారి మెమెంటోను అందజేశారు. మంత్రితో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ, వర్గల్ ఎంపీపీ లతారమేశ్గౌడ్, జడ్పీటీసీ, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు హాజరయ్యారు.
ఇవీ కూడా చదవండి…
జాతీయత తిన్నెలపై వేల్పుల వన్నెలు