సిద్దిపేట, మే 10 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఊర్లలోనే కేంద్రాలను ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేసి, అధికారులు కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అధికారులకు మంత్రి హరీశ్రావు దిశానిర్దేశం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు 72 గంటల్లోనే రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేటలో 403 కేంద్రాలు..90,501 మెట్రిక్ టన్నులు..
సిద్దిపేట జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో వందల కోట్ల విలువైన ధాన్యం పంట పండిందని అధికారుల అంచనా వేశారు. జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతుల పంట పొలాలకు సాగు జలాలు రావడంతో రైతులు రికార్డు స్థాయిలో వరి పంటను సాగు చేసి, అధిక దిగుబడులు సాధించారు. రంగనాయక, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లతో పాటు తపాస్పల్లి రిజర్వాయర్, శనిగరం మధ్యతరహా ప్రాజెక్టు, కూడవెల్లి, హల్దీవాగు పరీవాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు వరిని సాగు చేశారు. జిల్లాలో యాసంగిలో 2.83లక్షల ఎకరాల్లో వరిసాగైంది. 6,35,831 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తున్నదని అధికారులు అంచనా వేశారు. సిద్దిపేట జిల్లాలో 407 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని గుర్తించి, 403 కేంద్రాలు (ఐకేపీ 224, సొసైటీల ద్వారా 167, ఏఎంసీ 8, మెప్మా 4) ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా రైతులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్రానికి వచ్చే ముందే రైతులకు టోకెన్లు ఇస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 17,137 మంది రైతుల నుంచి 90,501 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నారు. దీని విలువ రూ.170.86 కోట్లు ఉంటుంది. ఇప్పటికే జిల్లాలోని 5,672 మంది రైతుల ఖాతాల్లో రూ.59.66 కోట్లు జమ అయ్యాయి. వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవు కావడంతో రైతుల చెల్లింపులు కాస్త ఆలస్యమైంది. మంగళవారం వరకు చాలా మంది రైతులకు డబ్బుల పడనున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.
ఎండను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్న హమాలీలు..
మండుటెండను సైతం లెక్క చేయకుండా హమాలీలు పనిచేస్తున్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లుగా కాంటాలు పెట్టి, లారీలు రాగానే లోడ్ చేసి పంపుతున్నారు. ఎండను సైతం వారు లెక్క చేయడం లేదు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రతి మండలంలో ఒక ప్రత్యేక బృందం నిరంతరం పనిచేస్తున్నది. మండల ప్రత్యేకాధికారి, తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు. ఒకేసారి కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున ధాన్యం రాకుండా రైతులకు టోకెన్ పద్ధతి అమలు చేస్తున్నారు. ట్రక్ షీట్ వచ్చిన 72 గంటల్లోనే డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమవుతున్నాయి. ఇందుకు సంబంధించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్రక్ షీట్లో వారి వివరాలను నమోదు చేసి వెంటనే అప్లోడ్ చేస్తారు. దీంతో వారికి చెల్లింపులు త్వరగా చేసే వీలుంటుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మా మదిలోనే ఉంటడు
సీఎం కేసీఆర్ సారు మా మదిలోనే ఉంటడు. మాకు వరి కాంటా అయిందో లేదో తెల్లారె పైసలు ఖాతాలో పడ్డయ్. ఇంత గొప్ప ముఖ్యమంత్రిని నేనెప్పుడు చూడలేదు. అధికారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. బయట అమ్మకాలు జరిపితే దళారులు పీల్చీపిప్పి చేద్దురు. కొనుగోలు కేంద్రాలతో ఆ బాధలన్నీ తప్పినయ్.
సీఎం కేసీఆర్ సార్ చల్లగుండాలి..
గింతటి ఆపతి కాలంలో కూడా భూమిని నమ్ముకొని బతికే రైతులను సీఎం కేసీఆర్ సారు మంచిగా సూత్తుండు. నేను నా ధాన్యాన్ని ఐకేపీలో అమ్మిన రెండు రోజుల్లోనే రాష్ట్రం ప్రభుత్వం నా బ్యాంకు ఖాతాలో జమ చేసింది. రైతులను మంచిగ సూత్తున్న సీఎం కేసీఆర్ సారును భగవంతుడు నూరేండ్లు చల్లగా చూడాలని కోరుకుంటున్న. – బోరం యాదమ్మ, మహిళా రైతు, గ్రామం మోతె,
మండల్ మిరుదొడ్డి