సిద్దిపేట జోన్, మే 10 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట విద్యాశాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా ఉపాధ్యాయులకు కరోనా సమయంలో ధ్యానం ద్వారా రోగనిరోధకశక్తి పెంచుకోవడం కోసం సిద్దిపేట జిల్లా యోగా అసొసియేషన్ సహకారంతో ఆన్లైన్లో యూట్యూబ్ చానల్ ద్వారా శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతుల సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆన్లైన్ ద్వారా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ప్రస్తుతం కరోనా బాగా ఉందని, ఉపాధ్యాయులకు యోగా పై శిక్షణ తరగతులు విద్యాశాఖ రూపొందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేయకుండా ప్రతిరోజు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుందన్నారు. శరీరంలోని అంతర్భాగాలకు సంపూర్ణ ఆరోగ్యాన్ని యోగాసనాల ద్వారా పొందవచ్చన్నారు.
కరోనా ప్రధానంగా శ్వాస ప్రక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందన్నారు. యోగాతో శ్వాస ప్రక్రియను మెరుగుపర్చుకుంటే కరోనాను జయించవచ్చని తెలిపారు. జిల్లా విద్యాధికారి రవికాంతారావు మాట్లాడారు. 2వేల మంది ఈ కార్యక్రమం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు అందరూ కూడా పాల్గొనవచ్చన్నారు. https://youtu.be/qk1-YmwQZaE youtube live ద్వారా హాజరు కావచ్చన్నారు. లైవ్లో హాజరు కాలేని వారు siddipet vidya mithra you tube channel లో చూడొచ్చని తెలిపారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు ఈ నెల 19 వరకు శిక్షణ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి డా.రమేశ్ తదితరులు మాట్లాడారు. సిద్దిపేట జిల్లా యోగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కొమురవెల్లి అంజయ్య, తోట అశోక్, ప్రధాన కార్యదర్శి నిమ్మ శ్రీనివాస్రెడ్డి, యోగా శిక్షకుడు తోట సతీశ్ హాజరయ్యారు.
జగదేవ్పూర్, మే 10 :కరోనా కష్టకాలంలో రెండు దఫాలలో ఒక్క కొవిడ్ కేసు నమోదు కాని గ్రామంగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని బస్వాపూర్ నిలవడం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, సర్పంచ్ మమత ఇంద్రసేనారెడ్డి, సిబ్బందిని, గ్రామ ప్రజలను సోషల్ మీడియా ద్వారా అభినందించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన కొవిడ్ నివారణ చర్యలు అద్భుతమన్నారు. ఇదే స్ఫూర్తిని గ్రామ పంచాయతీ ప్రజలు కొనసాగించాలని సూచించారు. కొవిడ్ రాకుండా గ్రామంలో సర్పంచ్ మమత ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి ప్రశాంత్, ఆశవర్కర్ లత, అంగన్వాడీ వర్కర్ స్వాతి సిబ్బందితో కలిసి పటిష్టచర్యలు చేపట్టారు. గ్రామంలో కరోనా కట్టడికి చేపడుతున్న చర్యలను ఫొటోల రూపంలో మంత్రి హరీశ్రావుకు వాట్సప్ చేయగా వాటిని పరిశీలించిన ఆయన సూపర్ అని అభినందించారు. గ్రామస్తుల సంపూర్ణ సహకారంతోనే గ్రామంలో కరోనా రాకపోవడానికి ప్రధాన కారణం అని, అందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సర్పంచ్ తెలిపారు. గ్రామంలో చేపడుతున్న కరోనా కట్టడి చర్యలో ఆశ, అంగన్వాడీ వర్కర్, మహిళా సంఘం అధ్యక్షురాలు కవిత, సీఏ విజయ, వీఆర్ఏ శంకర్ తదితరులు ఉన్నారు.