దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి
దుబ్బాక, మే 8 :
ఓ పక్క గృహిణిగా ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా సేవలందిస్తూ.. మరో ప్రజాప్రతినిధిగా ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉంటూ తనకంటూ ప్రత్యేకత చాటుకుంటున్నారు దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి. మదర్స్ డే సందర్భంగా ఆమె గురించి అందిస్తున్న ప్రత్యేక కథనం. దుబ్బాక పట్టణానికి చెందిన వనితారెడ్డి వ్యవసాయ కుటుంబంలో జన్మించింది. నలుగురు సంతానంలో చిన్నదైన వనితారెడ్డి, పాఠశాల స్థాయిలో చదువులో చురుగ్గా ఉండేది. తల్లిదండ్రులు కిష్టవ్వ బాల్రెడ్డికి వ్యవసాయమే లోకం. వనితారెడ్డి చదువుకునే సమయంలో అన్నలతో కలిసి వ్యవసాయ పనులు చేసేది. ఇంటర్ పూర్తికాగానే దుబ్బాకకు చెందిన భూంరెడ్డితో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సమన్విత, అన్విత. భర్త భూంరెడ్డి కష్టాన్ని నమ్ముకుని ఆర్థికంగా ఎదిగాడు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ వచ్చాడు. దుబ్బాక గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వార్డు మెంబర్గా పని చేశాడు. ఆయన సేవలను గుర్తించిన దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి రాజకీయంగా వెన్నుతట్టి ప్రోత్సహించారు. దుబ్బాక మున్సిపాలిటీకి 2020లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో 18వ వార్డులో జనరల్ మహిళగా రిజర్వ్ కావడంతో భూంరెడ్డి తన సతీమణి వనితారెడ్డిని టీఆర్ఎస్ నుంచి పోటీ చేయించి గెలిపించారు. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అనూహ్యంగా వనితారెడ్డికి దక్కింది. దుబ్బాక మున్సిపాలిటీ చైర్పర్సన్గా కొనసాగుతూ..నిత్యం ప్రజాసేవ చేస్తున్నారు. అందరి సహకారంతో దుబ్బాక పట్టణాన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. తల్లిగా.. గృహిణిగా.. ప్రజాప్రతినిధిగా అన్ని బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు.
రాజకీయాల్లోకి వచ్చాక బాధ్యతలు పెరిగాయి…
రాజకీయాల్లోకి రాకముందు ఇల్లు ,పిల్లలు, కుటుంబం తప్ప ఏమి తెలియదు. 2020లో తొలిసారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసి రాజకీయాల్లోకి ప్రవేశించా. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి చైర్ పర్సన్గా అవకాశం కల్పించారు. ఇల్లు, పిల్లలే లోకంగా ఉన్న నాకు రాజకీయం కొత్త కావడంతో ఎన్నోరకాల సవాళ్లు , ప్రతి సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో రకాలుగా రాజకీయ ఆటంకాలు కలిగించినప్పటికీ, ప్రజాసేవలో మున్సిపల్ చైర్పర్సన్గా రాణించగలుగుతున్నా. అటు కుటుంబం, ఇటు ప్రజాప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ప్రజలకు సేవచేసే భాగ్యం దక్కటం అదృష్టంగా భావిస్తున్నా.
-గన్నె వనితాభూంరెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్