మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో ఈ యాసంగిలో వరి ఇరుగ పండింది. ఎటుచూసినా పొలాలు ధవళ వర్ణంలో వరిపైర్లతో కళకళలాడుతున్నాయి. సర్కారు సాయం, వరుణుడి కరుణతో గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వరి సాగుచేయగా.. వరి కోతలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు యాభై శాతం పూర్తయ్యాయి. డివిజన్లో 108 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, ధాన్యం పొటెత్తుతున్నది. గతేడాది యాసంగిలో 48,809 ఎకరాల్లో వరి సాగు కాగా, 9,34,720 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈసారి 75,584 ఎకరాల్లో వరి సాగైంది. 15,11,680 క్వింటాళ్ల వడ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు ధాన్యం సేకరణకు యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. నీటి కొరత ఉండే మెట్ట ప్రాంతంలో కోనసీమను తలపించేలా వరి సాగై మంచి దిగుబడులు వస్తుండడంతో రైతుల్లో ఆనందం నెలకొంది. -హుస్నాబాద్, మే 8
హుస్నాబాద్, మే 8 :
మెట్ట ప్రాంతమైన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్లో ఈ యాసంగిలో వరిపంట ఇరుగ పండింది. సర్కారు సాయం, వరుణుడి కరుణతో గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారు. చివరలో కొన్ని మండలాల్లో సాగునీటి ఇబ్బందులు తలెత్తినప్పటికీ, దీన్ని కూడా అధిగమించి వరుస తడులతో పంటను రక్షించుకున్నారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు వాడడంతో రికార్డుస్థాయిలో దిగుబడులు వచ్చాయని వ్యవసాయ అధికారులు తెలిపారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, మద్దూరు మండలాల్లో వరికోతలు జోరందుకున్నాయి. సుమారు 50శాతం వరకు కోతలు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలు వడ్లతో కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా వడ్ల రాసులే కనిపిస్తున్నాయి.
గతేడాది 48,809 ఎకరాల్లో వరిసాగు…
హుస్నాబాద్ డివిజన్లోని ఐదు మండలాల్లో గత యాసంగి (2019-20) సీజన్లో 48,809 ఎకరాల్లో వరిపంట సాగు కాగా, మొత్తం 22,394 మంది రైతుల నుంచి 9,34,720 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. సీడ్కు సంబంధించిన వడ్లు మరో 50వేల క్వింటాళ్ల వరకు ఉంటుంది. రైతులకు రూ.171,51కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఈ ఏడాది కూడా క్వింటాలుకు ఏ-గ్రేడ్కు రూ.1,888, కామన్ రకానికి రూ.1,868 చెల్లిస్తున్నది. అంతేకాకుండా రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో మెట్ట రైతులు సంబురపడుతున్నారు.
ఈ సారి 75,584 ఎకరాల్లో వరిసాగు..
ఈ యాసంగి (2020-21) సీజన్లో హుస్నాబాద్ డివిజన్లో మొత్తం 75,584 ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. ఒక్కో ఎకరానికి సుమారు 20నుంచి 25క్వింటాళ్ల వడ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఎకరానికి 20క్వింటాళ్ల దిగుబడి వచ్చినా కూడా డివిజన్లోని అన్ని మండలాలు కలిపి 15,11,680 క్వింటాళ్ల వడ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్కన్నపేట మండలంలో 14,976 ఎకరాలు, బెజ్జంకి 12,339, హుస్నాబాద్ 13,698, కోహెడ 17,710, మద్దూరులో 16,859 ఎకరాల్లో వరి సాగుచేశారు. సుమారు 15లక్షల క్వింటాళ్ల ధాన్యం దిగుబడి రావడం డివిజన్ చరిత్రలో ఇది మొదటి సారి అని, ఇంతటి పంట రావడం ఆనందంగా ఉందని రైతులు అంటున్నారు. డివిజన్లో ప్యాక్స్ ద్వారా 70, ఐకేపీ ద్వారా 36, ఏఎంసీ ద్వారా 2, మొత్తం 108 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోళ్లను ముమ్మరం చేశారు.
యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరి పంట వివరాలు(ఎకరాల్లో)
క్ర.సం మండలం 2019-20 2020-21
పేరు యాసంగిలో యాసంగిలో
1) అక్కన్నపేట 8,333.26 14,976.17
2) బెజ్జంకి 10,844.33 12,339.21
3) హుస్నాబాద్ 6,940.31 13.698.03
4) కోహెడ 12,921.10 17,710.35
5) మద్దూరు 9,768.26 16,859.28
మొత్తం 48,809.06 75,584.24
ఈ యాసంగి సీజన్లో రైతులు సాగు చేసిన వరిపంట.. దిగుబడి అంచనా… రైతులకు వచ్చే ఆదాయం…
క.సం. మండలం వరిసాగు దిగుబడి అంచనా రైతులకు వచ్చే
పేరు (ఎకరాల్లో) (క్వింటాళ్లలో) ఆదాయం(అంచనా)
1) అక్కన్నపేట 14,976.17 2,99,520 రూ.56,54,93,760
2) బెజ్జంకి 12,339.21 2,46,780 రూ.46,59,20.640
3) హుస్నాబాద్ 13.698.03 2,73,960 రూ.51,72,36.480
4) కోహెడ 17,710.35 3,54,200 రూ.66,87,29,600
5) మద్దూరు 16,859.28 3.37,180 రూ.63,65,95,840
మొత్తం 75,584.24 15,11,640 రూ.285,39,76,320
గతేడాది యాసంగి(2019-20) సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లు, చెల్లింపుల వివరాలు
క్ర.సం. మండలం వడ్లు అమ్మిన కొనుగోలు చేసిన ధాన్యం రైతులకు
పేరు రైతులు (క్వింటాళ్లలో) చెల్లింపులు
1) అక్కన్నపేట 3,568 1,39,758 రూ.25,64,04,576
2) బెజ్జంకి 4,171 1,85,867 రూ.34,10,64,406
3) హుస్నాబాద్ 3,507 1,42,357 రూ.26,12,11,204
4) కోహెడ 6,181 2,78,898 రూ.51,17,62,742
5) మద్దూరు 4,967 1,87,840 రూ.34,46.73,016
మొత్తం 22,394 9,34,729 రూ.171,51,15,944
ఎకరానికి 60 బస్తాలు వస్తున్నయ్..
నాతో పాటు చుట్టుపక్కల రైతులకు ఎకరానికి 40కిలోల బస్తాలు 60వరకు వస్తున్నయ్. మంచిగ నీళ్లు ఉన్న రైతులందరికీ ఈ సారి పంట బాగా పండింది. పోయిన యాసంగి కంటే ఈ సారి పంట బాగా పండింది. ఈ సారి వానలు మంచిగ పడ్డయ్. రైతులకు ఇబ్బంది కాకుండా సర్కారు పెట్టుబడి సాయం అందించింది.
ఈ సారి దిగుబడి పెరిగింది..
ఈ యాసంగి సీజన్లో వరిసాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పంట దిగుబడి గతంలో కంటే ఎక్కువ వస్తుంది. కొన్నిచోట్ల మినహా మిగతా అన్ని మండలాల్లో సాగునీరు బాగానే అందింది. దీంతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వాడకం, వ్యవసాయశాఖ అధికారుల నిరంతర పర్యవేక్షణ రైతులకు కలిసి వచ్చాయి. అందుకే ఈ సారి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 50శాతం వరి కోతలు పూర్తయ్యాయి.