సిద్దిపేట జోన్/ సిద్దిపేట అర్బన్, మే 7 : సిద్దిపేట పురపాలక సంఘం చైర్పర్సన్గా కడవేర్గు మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్గా జంగిటి కనకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో 43వార్డులకు గాను 36 వార్డుల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. గెలిచిన ఐదుగురు స్వతంత్రుల చేరికతో టీఆర్ఎస్ బలం 41కి చేరింది. శుక్రవారం నిర్వహించిన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనంగా జరిగింది. మధ్యాహ్నం 3గంటలకు పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండడంతో 2.30 గంటలకే టీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ సిద్దిపేటలోని రెడ్డి సంఘం నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకు ముందు రెడ్డిసంఘంలో నూతన కౌన్సిలర్లతో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల పరిశీలకులు రవీందర్సింగ్, వంటేరు ప్రతాప్రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్ఎస్ అధిష్టానం నుంచి వచ్చిన సీల్డ్ కవర్లో చైర్మన్ అభ్యర్థిగా కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్గా జంగిటి కనకరాజును ఖరారు చేశారు.
మున్సిపల్ కార్యాలయానికి కౌన్సిలర్ల రాక..
సిద్దిపేటలోని రెడ్డిసంఘం నుంచి టీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ ప్రత్యేక బస్సులో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరితో పాటు మున్సిపల్ ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. కోరం వందశాతం ఉండడంతో మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్చే నియమించబడిన ప్రత్యేకాధికారి జయచంద్రారెడ్డి సమావేశాన్ని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు. 43 మంది కౌన్సిలర్లతో పాటు మంత్రి హరీశ్రావు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఎక్స్అఫీషియో సభ్యుల హోదాలో రావడంతో బలం 45 మందికి చేరింది. ఈ సందర్భంగా సభ్యులను సభకు పరిచయం చేశారు.
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక..
మధ్యాహ్నం 3.30 గంటలకు చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రకటనను ప్రత్యేకాధికారి జయచంద్రారెడ్డి ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి కడవేర్గు మంజుల రాజనర్సును చైర్పర్సన్గా టీఆర్ఎస్ అధిష్టానం సూచనల మేరకు 16వ వార్డు కౌన్సిలర్ బర్ల మల్లికార్జున్ ప్రతిపాదించగా, 19వ వార్డు కౌన్సిలర్ గ్యాదరి రవీందర్ బలపర్చారు. నిర్ణీత గడువులోగా మరెవ్వరు పోటీలో లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. వైస్ చైర్మన్ అభ్యర్థిగా టీఆర్ఎస్ తరపున జంగిటి కనకరాజు పేరును 26వ వార్డు కౌన్సిలర్ కెమ్మసారం ప్రవీణ్ ప్రతిపాదించగా, 22వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల అరవింద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపర్చారు. నిర్ణీత గడువులోగా మరెవరు పోటీలో లేకపోవడంతో జంగిటి కనకరాజు వైస్ చైర్మన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం..
సిద్దిపేట మున్సిపల్ చైర్మ్పర్సన్గా కడవేర్గు మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్గా జంగిటి కనకరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్పర్సన్గా ఎన్నికైన కడవేర్గు మంజుల, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజుతో ప్రత్యేకాధికారి జయచంద్రారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.
మంత్రి హరీశ్రావు అభినందనలు..
సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికైన కడవేర్గు మంజుల రాజనర్సు, వైస్ చైర్మన్గా ఎన్నికైన జంగిటి కనకరాజును మంత్రి హరీశ్రావు శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ అభినందించారు. కౌన్సిలర్లు వీరికి శుభాకాంక్షలు తెలిపారు.
అభినందనలు..
టీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులు రవీందర్సింగ్, వంటేరు ప్రతాప్రెడ్డి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లను అభినందించారు. మంజులకు పలువురు కౌన్సిలర్లు అభినందించి స్వీట్లను పంచుకున్నారు. కడవేర్గు మంజుల తన భర్త, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సుకు స్వీట్లు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు.
గజమాలతో సత్కరణ..
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు దంపతులను టీఆర్ఎస్ నాయకులు కూర బాల్రెడ్డి, సత్యంగౌడ్ గజమాలతో సత్కరించి శాలువాతో సన్మానించారు.