సిద్దిపేట అర్బన్/గజ్వేల్ రూరల్, జూన్6 : అనారోగ్యంతో ఏడాది క్రితం తండ్రి మృతి చెందగా, నేడు తల్లి కరోనాతో మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్రవిషాదం అలుముకున్నది. ఏడాది కాలంలో దంపతులిద్దరూ మృతి చెందడంతో కుమారుడు, నలుగురు కూతుర్లు అనాథలయ్యారు. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల రోదన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. గజ్వేల్ మండల పరిధిలోని శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన యాదయ్య(50) గతేడాది అనారోత్యంతో బాధపడుతూ మృతి చెందాడు. తండ్రి మృతి చెందడంతో అన్నితానై తల్లి లక్ష్మి(40) ఐదుగురు పిల్లలను పోషిస్తూనే, చదివించుకుంటున్న సమయంలో కరోనా రక్కసి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. కరోనాతో లక్ష్మి ఆదివారం మృతి చెందడంతో ఐదుగురు పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. తలిదండ్రులను కోల్పోయిన పిల్లలను చూసిన వారంతా అయ్యే పాపం అంటూ వారిని ఓదార్చారు. కాగా కుమారుడు సతీష్ బైక్ మెకానిక్గా పని చేస్త్తూ తల్లికి ఆసరాగా నిలిచాడు. పెద్ద కూతురు అనుష పదో తరగతి పూర్తవగా, మరో కుమార్తె అశ్విని ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నది. స్పందన ఆరు, మేనక నాల్గో తరగతి చదువుతున్నారు. ఏడాది కాలంలోనే తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి ఆదుకోవాలని గ్రామస్తులు, సర్పంచ్ చెరుకు చంద్రమోహన్రెడ్డి కోరుతున్నారు.
కరోనాతో తల్లిని కోల్పోయిన ముగ్గురు ఆడపిల్లలు
కరోనా మరో కుటుంబంలో విషాదం నింపింది. 6ఏండ్లలోపు ఆడ పిల్లలు కరోనాతో తల్లిని కోల్పోయారు. సిద్దిపేట రూరల్ మండలం రావురూకుల గ్రామానికి చెందిన పారిశుధ్య కార్మికుడు నీరటి నారాయణమూర్తి భార్య రేణుక (28) కరోనాతో మృతి చెందింది. తల్లి మరణంతో ఆ చిన్నారులు, భర్త నారాయణమూర్తి దుఃఖం లో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న విజేత యూత్ సభ్యులు సర్పంచ్ నీరటి కవిత రవీందర్తో కలిసి బియ్యం, ఆర్థిక సాయం అందజేశారు.