మెదక్ మున్సిపాలిటీ, మే 6 : మనో ధైర్యంతోనే కరోనాను జయించానని మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. కరోనాను ఎలా జయించాలో ఆయన మాటల్లోనే.. కరోనా వచ్చిందిని తెలిసిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయవద్ద్దు. వైద్యులను సంప్రదించి వారిచ్చే సూచనలను పాటిస్తూ తగిన జాగ్రతలు తీసుకోవాలి. ఒక్కొక్కరికి ఒక్కో విధమైన లక్షణాలు ఉంటున్నాయి. కరోనా సోకిందని ఆందోళన చెందకుండా మనో ధైర్యంతో ఉండాలి. భయమే మనల్ని చంపేస్తుంది. ఎట్టి పరిస్థితిలో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు. ఏప్రిల్ 5వ తేదీన జలుబుతో పాటు జ్వరం రావడంతో మెదక్లో కరోనా టెస్ట్ చేసుకోగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు ఐసొలేషన్లో ఉన్నా. కొద్దిగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో వైద్యుల సూచన మేరకు ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో వారం రోజుల పాటు చికిత్స తీసుకొని 15 రోజుల పాటు ఇంట్లోనే ఐసొలేషన్లో ఉన్నాను. వైద్యుల సలహాలు పాటిస్తూనే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కావాల్సిన ఆహారం, పండ్లు తీసుకుంటూ ఇంటి ఆవరణలోనే నడకలాంటివి వ్యాయామం చేశాను’ అని వివరించారు.