సిద్దిపేట, జూన్ 04( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాలని, ఇక్కడ పనిచేయడం అదృష్టంగా, గౌరవంగా భావించాలని.. నాణ్యతతో పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులకు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. ‘గడా’ పరిధిలో అభివృద్ధి పనుల పురోగతిపై ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజమ్మీల్ఖాన్, మున్సిపల్ చైర్మన్లు, ఇంజినీరింగ్ అధికారులతో శుక్రవారం రంగనాయకసాగర్ అతిథి గృహంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గజ్వేల్ పట్టణంలో సిద్ధంగా ఉన్న 1250 డబుల్ బెడ్రూం ఇండ్లను సిద్దిపేటలో మాదిరిగా అర్హులైన పేదలకు కేటాయించాలని అధికారులకు సూచించారు. గజ్వేల్ పట్టణానికి సంబంధించి డబుల్ బెడ్రూం ఇండ్లకు దరఖాస్తులను ఈనెల 13 నుంచి 20 వరకు స్వీకరించాలన్నారు.
కొండపాక మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్లను ఈనెల 20న, కొండపాక మండలంలోని ఖమ్మంపల్లి, వెలికట్ట, విశ్వనాథపల్లి, నాగిరెడ్డిపల్లిలో పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లకు ఈనెల 21న, ములుగు మండలంలోని 3 గ్రామాలకు సంబంధించి 23న , మర్కూక్ మండలం పాములపర్తి, జగదేవ్పూర్ మండలం చాట్లపల్లిలో 27న దరఖాస్తులు స్వీకరించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. మనోహరాబాద్ డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి జూలై మొదటి వారంలో దరఖాస్తులు స్వీకరించాలన్నారు. తూప్రాన్లో ఆగస్టు నెలాఖరులోగా ఇండ్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు.అన్ని డబుల్ బెడ్రూం ఇండ్లు, కాలనీలకు విద్యుత్ సౌకర్య కల్పించాలని విద్యుత్ అధికారులను మంత్రి ఆదేశించారు.
గజ్వేల్ పట్టణంలో స్ట్రీట్ లైట్స్ కోసం అవసరమైన విద్యుత్ స్తంభాలు ఇవ్వాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లను వేగంగా పూర్తి చేసేందుకు ‘గడా’ పరిధిలోని తహసీల్దార్లకు బాధ్యతలు అప్పగించాలని ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డిని మంత్రి ఆదేశించారు. ఇంజినీరింగ్ అధికారులు కూడా ప్రగతిపై ప్రతి వారం వర్క్ ఏజెన్సీలతో సమీక్షా నిర్వహించాలన్నారు. జూలై 15న తూప్రాన్ సమీకృత మార్కెట్, గ్రైన్ మార్కెట్లను ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలన్నారు. జగదేవ్పూర్ రైతు మార్కెట్ను ఈనెల 27న, గజ్వేల్ పత్తి మార్కెట్ను రెండు నెలల్లో ప్రారంభోత్సవాలకు సిద్ధం చేయాలని సూచించారు. ( TSEWIDC) ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలో రూ.23.95 కోట్లతో 32 పనుల ప్రగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు.వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆదేశించారు.
నాణ్యతతో పనులు చేపట్టాలి…
‘గడా’ పరిధిలో పెండింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన నాణ్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం, సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలుంటే ‘గడా’ ప్రత్యేకాధికారి లేదా కలెక్టర్ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. త్వరలో ‘గడా’ పరిధిలోని మండలాల వారిగా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలుపై సమీక్షా సమావేశం నిర్వహిస్తానని మంత్రి తెలిపారు. ‘గడా’ పరిధిలో ఇప్పటికే సర్పంచులు పూర్తి చేసిన అభివృద్ధి పనులను సంబంధించి ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే వెంటనే చెల్లింపులు చేయాలని ఆదేశించారు.
నవంబర్లోగా యూజీడీ పూర్తి చేయాలి…
నవంబర్లోగా ప్రగతిలో ఉన్న గజ్వేల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ఇప్పటికే 63శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. ఎస్టీపీ పనులు కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నామన్నారు. దెబ్బతిన్న అంతర్గత రోడ్ల పనులు పునరుద్ధరించాలన్నారు. గజ్వేల్లో స్లాటర్ హౌస్ ఏర్పాటు కోసం స్థలం మున్సిపల్ చైర్మన్, కమిషనర్ కలిసి ఖరారు చేయాలన్నారు. తూప్రాన్లో డంపింగ్ యార్డు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు.
పల్లె ప్రగతి నిధులు వినియోగించాలి…
గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రూ.20 లక్షలకు తగ్గకుండా పల్లె ప్రగతి నిధులు ఉన్నాయని మంత్రి హరీశ్రావు తెలిపారు. గ్రామస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి సర్పంచులు వెంటనే వారి కోసం ఖర్చు చేసేలా చూడాలన్నారు. హరితహారం కోసం కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. రైతు వేదికల్లో రైతులతో వానకాలం సాగు కార్యాచరణపై సమావేశాలు నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
రైతుబంధు అందేలా చూడాలి…
ఈనెల 10వ తేదీ వరకు భూసమస్యల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని, సాగు భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు అదేలా చూడాలని మంత్రి అన్నారు. వ్యవసాయ అధికారులు తహసీల్దార్లను సమన్వయం చేసుకుంటూ ప్రతి రైతుకు రైతుబంధు అందేలా చూడాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వ్యవసాయాధికారులు వారంలోగా ప్రతి గ్రామంలో స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, రైతులతో సమావేశం నిర్వహించి భూసమస్యల పరిష్కారం కోసం మీ సేవలో ఐప్లె చేసుకునే విధి విధానాలపై గైడ్ చేయాలన్నారు. సమావేశంలో ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్, తూప్రాన్ ఆర్డీవోలు, చైర్మన్లు, కమిషనర్లు, విద్యుత్, పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ, మిషన్ భగీరథ ఇంజినీర్లు, గజ్వేల్ నియోజకవర్గ ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ పనులపై నివేదికను అందించండి…
గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 99 కమ్యూనిటీ హాళ్లను మంజూరు చేశామని, వచ్చే 10 రోజుల్లో వాటి తాజా ప్రగతి, పెండింగ్ పనులపై సమగ్ర నివేదిక ఫొటోలతో సహ అందించాలని మంత్రి హరీశ్రావు అధికారులకు సూచించారు. గజ్వేల్ పట్టణంలో మేజర్ కమ్యూనిటీ హాల్లను మంజూరు చేశామని, వీటి ప్రగతి నివేదికను సైతం అందించాలని చెప్పారు.నియోజకవర్గంలో మొత్తం 177 గ్రామాలుండగా.. గత, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 66 గ్రామాలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించామన్నారు. ఇప్పటి వరకు నిధులు కేటాయించిన గ్రామాల వివరాలను, పీఆర్ ద్వారా చేపట్టిన పనుల్లో పెండింగ్ పనుల వివరాలు అందించాలని పీఆర్ ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు.ఇక ముందు చేపట్టబోయే పనుల ఎస్టిమేషన్ వాస్తవికంగా, సమగ్రంగా ఉండాలన్నారు.