సిద్దిపేట కలెక్టరేట్, జూన్ 1 : అన్నదాతలు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరతో కొంటున్న ఏకైక రాష్ట్రం మనదే అని ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 85శాతానికి పైగా ధాన్యాన్ని రైతుల నుంచి కొన్నామన్నారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైన దృష్ట్యా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మిగతా 15శాతం ధాన్యాన్ని సాధ్యమైనంత త్వరగా కొనేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రేపటిలోగా 7 లక్షల గన్నీ బ్యాగులను సిద్ధం చేశామన్నారు. గన్నీ బ్యాగులు జిల్లాకు రాగానే, జిల్లాలో హమాలీలు, వాహనాల కొరత లేకుండా ధాన్యాన్ని తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం లిప్ట్ చేసేందుకు వీలుగా జిల్లా పరిధిలో నుంచి వెళ్లే ఇసుక లారీలను రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా స్వాధీనం చేసుకొని, వాటిని ఉపయోగించుకోవాలన్నారు. హుస్నాబాద్ డివిజన్లో ఇప్పటికే చాలా వరకు కొనుగోలు కేంద్రాలు క్లోజ్ చేసినందున అక్కడి హమాలీలను సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గ పరిధి కేంద్రాల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే మూడు రోజులు ధాన్యం సేకరణకు అత్యంత కీలకమన్నారు. జిల్లా ధాన్యం కొనుగోలుకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీతో పాటు రైతులకు డబ్బులు చెల్లింపుల్లో తెలంగాణలోనే ప్రథమస్థానంలో ఉన్నదని, అదే స్ఫూర్తితో పంట మొత్తం కొనే దాకా అధికారులు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, డీఆర్వో చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
‘ధరణి’తో 98శాతం భూ సమస్యలకు పరిష్కారం
ధరణితో 98శాతం భూ సమస్యలను పరిష్కరించే వెసులు బాటును ప్రభుత్వం కల్పించిందని మంత్రి అన్నా రు. రైతులు నేరుగా మీ సేవలో ఆన్లైన్లో భూ సమస్య దరఖాస్తు చేసుకుంటే, వారం రోజుల్లోనే అధికారులు పరిష్కరించే వీలుందని స్పష్టం చేశారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో భూ సమస్యల పరిష్కారాలపై రెవెన్యూ, వ్యవసాయ మార్కెట్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. పూర్తి జవాబుదారీతనం, పారదర్శకతతో భూలావాదేవీల కోసం విప్లవాత్మకమైన ధరణి పోర్టల్ను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. రైతులు దీనిని పూర్తిస్థాయిలో సద్వినియోగించుకోలేక పోతున్నారన్నారు. ధరణికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నదన్నారు. ధరణిని వినియోగించుకునేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను సూచించారు. ప్రతి తహసీల్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, రైతులు దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. భూవిస్తీర్ణం అనుగుణంగా ప్రభుత్వం అందించే రైతుబంధును అన్నదాతలకు అందించాలని అధికారులను ఆదేశించారు.