జెండాలు ఆవిష్కరించనున్న అమాత్యులు
సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు
సంగారెడ్డిలో హోం మంత్రి మహమూద్ అలీ
మెదక్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
స్వరాష్ట్రంలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణను సాధించిన నేత.. రాష్ర్టానికి సారథి కావడంతో అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నది. పాలకుల్లో సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి, తపాస్పల్లి, తోటపల్లి, సింగూరు, హల్దీవాగులతో ఉమ్మడి మెదక్ సస్యశ్యామలంగా మారుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షత ఫలితంగా జిల్లాలు ఏడేండ్లలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందు వరుసలో నిలిచింది. అన్ని వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. త్వరలో ప్రభుత్వ మెడికల్, నర్సింగ్ కాలేజీల కల నెరవేరనున్నది. రాష్ట్రం ఆవిర్భవించి ఏడు వసంతాలు పూర్తయి, ఎనిమిదో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక కథనం.. – సిద్దిపేట, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) / సంగారెడ్డి(నమస్తే తెలంగాణ)
సంగారెడ్డి/ సిద్దిపేట కలెక్టరేట్/ మెదక్, జూన్ 1: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను మెతుకు సీమలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఆయా జిల్లా కేంద్రాలకు ప్రముఖులు హాజరు కానున్నారు. బుధవారం సంగారెడ్డి సమీకృత కలెక్టరేట్ భవన ప్రాంగణంలో నిర్వహించుకునే ఈ సంబురాలకు రాష్ట్ర హోం మంత్రి మహమూద్, సిద్దిపేట కలెక్టరేట్లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, మెదక్ కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకలకు పశు సంవర్ధక, మత్య్సశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వేర్వేరుగా హాజరై జెండా ఆవిష్కరణ చేయనున్నారని ఆయా జిల్లాల కలెక్టర్లు మంగళవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి అనంతరం కార్యక్రమంలో పాల్గొంటారని వివరించారు. ఉదయం 9 గంటలకు జరిగే అవతరణ వేడుకలకు వచ్చే వారందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.