సిద్దిపేట టౌన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. ఈ నెల 3న కౌంటింగ్ నేపథ్యంలో కౌన్సిలర్గా పోటీ చేసిన అభ్యర్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులకు ముందస్తుగా శనివారం పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర సంఘం ఎన్నికల నిబంధనల ప్రకారం కౌంటింగ్ కేంద్రంలోనికి వచ్చే పోటీ చేసిన అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు తప్పకుండా కొవిడ్ పరీక్షలు చేయించుకొని నెగెటివ్ రిపోర్టులు ఉంటేనే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామన్నారు. విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. కౌంటింగ్ సెంటర్లు, పరిసర ప్రాంతాల్లో సిద్దిపేట, గజ్వేల్ పట్టణాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రానికి ఒక కిలో మీటరు దూరంలో ఐదుగురు కానీ, అంతకంటే ఎక్కువ మంది కానీ ఉండొద్దన్నారు. పార్టీ జెండాలు, గుర్తులు, ప్లేకార్డులు ధరించి ప్రదర్శించొద్దన్నారు. మైక్లు, లౌడ్ స్పీకర్లు, పాటలు, ఉపన్యాసాలు ఇవ్వకూడదని తెలిపారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. ఊరేగింపుల్లో పటాకులు కాల్చడం లాంటివి వద్దని, ఎవరైన ఇలాంటి వాటికి పాల్పడితే నేరంగా పరిగణించడంతో పాటు సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.
కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..
సిద్దిపేట మున్సిపాలిటీ, గజ్వేల్ 12వ వార్డు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్లు ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాల, సంగాపూర్ రోడ్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఈ నెల 3న ఉదయం 6 గంటల నుంచి 4న 6 గంటల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల కౌంటింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. పోలీసుల సలహాలు, సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ నిర్వహణకు సహకరించాలని కోరారు.