సిద్దిపేట జోన్, ఏప్రిల్ 1: కోమటి చెరువు నెక్లెస్ రోడ్డుతో కొత్త అందం సంతరించుకుందని, నెక్లెస్ రోడ్డు పనులను రెండు మూడు రోజుల్లోగా పూర్తి చేసి ఈ వేసవి ప్రత్యేకతగా పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశించారు. గురువారం మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ రమణాచారి, ఈఈ వీరప్రతాప్, ఏఈలు, మున్సిపల్ ఆధికారులతో పట్టణంలో అభివృద్ధి పనులపై మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని బీటీ, సీసీ రోడ్ల నిర్మాణంపై ఆరా తీశారు. బీటీ వేసిన విక్టరీ టాకీస్ నుంచి కోర్టు, ఎక్బాల్ మినార్ నుంచి బారాహిమామ్, సుభాష్రోడ్లలో పెయిటింగ్, స్లడ్స్ వేయాలని, హౌసింగ్ బోర్డ్, శ్రీనగర్కాలనీల్లో పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. యూజీడీ, గ్యాస్ కనెక్షన్ పైపులైన్ పనులు వేగంగా చేసి, గుంతులు పూడ్చి సీసీ రోడ్డు వేయాలన్నారు.
స్వచ్ఛబడిని ప్రారంభానికి సిద్ధం చేయాలి
సిద్దిపేట మున్సిపాలిటీలో దక్షిణాదిలోనే మొదటి సారిగా నిర్మిస్తున్న స్వచ్ఛబడి పనులను రెండు మూడు రోజుల్లోగా పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులకు సూచించారు. దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా పలు అవార్డులను సాధించిన స్ఫూర్తితో స్వచ్ఛతపై పాఠాలు చెప్పేందుకు దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో కుక్క లు, కోతుల బెడద నివారణకు నిర్మిస్తున్న ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభానికి సిద్ధ్దం చేయాలని సూచించారు. స్వచ్ఛ స్వ్కాడ్ వాహనం ప్రతి రోజూ పుర వీధుల్లో తిరుగుతూ చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. చెత్త సేకరణ వాహనాలు సమయ పాలన పాటించేలా చూడాలన్నారు. దోమల నియంత్రణకు ఫాగింగ్ చేయాలని, కరోనా నేపథ్యంలో హెడ్రో క్లోరిన్ పిచికారీ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.
ఇవీ కూడా చదవండీ..
మేలో చలో పార్లమెంట్.. సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటన
వ్యవసాయాన్నిలాభసాటిగా మార్చడానికి సంస్కరణలు తేవాలి: వెంకయ్యనాయుడు