చిన్నకోడూరు, ఏప్రిల్ 01 : వానలు కురిసి వరద వచ్చిదంటే రాకపోకలు ఆగిపోవాల్సిందే.. వానకాలంలో చిన్నకోడూరు, నంగునూరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యల పరిష్కారానికి మంత్రి తన్నీరు హరీశ్రావు చొరవ చూపారు. వాగులపై బ్రిడ్జిల నిర్మాణానికి రూ.7.15 కోట్లను మంజూరు చేయించారు. చిన్నకోడూరు మండలంలో రెండు బ్రిడ్జిలు నిర్మాణం కానుండడంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్నకోడూరు మండలంలోని ఇబ్రహీంనగర్, గోనెపల్లి, ఒబులాపూర్, మాచాపూర్, సలెంద్రి, చౌడారం, మేడిపల్లి, మల్లారం, సికింద్లాపూర్, నంగునూరు మండలంలోని పాలమాకుల, రాజగోపాల్పేట, దర్గపల్లి, బద్దిపడగ, సిద్దన్నపేట తదితర గ్రామాల ప్రజలు, రైతులు, ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. వానకాలంలో కొన్ని ఊర్లకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గోనెపల్లి – ఇబ్రహీంనగర్ గ్రామాల మధ్య వాగు పారుతుండడంతో నేటికీ ద్విచక్ర వాహనదారులు నీటిలో వాహనాన్ని తోసుకుంటూ వెళ్తున్నారు. రైతులు బావుల వద్ద పండించిన పంట ఉత్పత్తులు సైతం తీసుకెళ్లేందుకు ఇక్కట్లు పడ్డారు. ప్రజల కష్టాలు గమనించిన మంత్రి హరీశ్రావు నిధులు మంజూరు చేసి శాశ్వత పరిష్కారానికి మార్గం చూపారు. దీంతో రైతులు, ప్రయాణికుల ముఖాల్లో ఆనందం నెలకొన్నది.
బ్రిడ్జిల నిర్మాణం ఇలా..
చిన్నకోడూరు మండలంలో బ్రిడ్జిల నిర్మాణానికి రూ.7.15 కోట్లు మంజూరు చేశారు. చిన్నకోడూరు మండలం మాచాపూర్ నుంచి నంగునూరు మండలానికి వెళ్లే రహదారి, వయా చౌడారం వద్ద రూ.3.65 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న దాని కంటే ఎక్కువ ఎత్తులో బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నారు. ఇబ్రహీంనగర్ – గోనెపల్లి గ్రామాల మధ్య వాగుపై రూ.3.50 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తారు. ఈ రెండింటి నిర్మాణంతో ఎప్పుడు వర్షాలు పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణం సాగించవచ్చు. రైతులు వారి వ్యవసాయ బావుల వద్ద సులువుగా వెళ్లవచ్చు. బ్రిడ్జిల నిర్మాణంతో ప్రయాణికులకు దూరభారం కూడా తగ్గనున్నది.
ఇవీ కూడా చదవండీ..