పంచాయతీల్లో ఖాళీ స్థలాలు కాపాడాలి
లేఅవుట్లలో 10శాతం స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలి
ఫెన్సింగ్ వేసి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలి
సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్
సంగారెడ్డి, ఏప్రిల్ 30: గ్రామ పంచాయతీల్లోని ఖాళీ స్థలాలు బాధ్యత పంచాయతీ కార్యదర్శులదేనని, ఖాళీ స్థలాలను కాపాడి వినియోగించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి సురేష్మోహన్ తెలిపారు. శుక్రవారం అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వ నిబంధనల మేరకు కార్యదర్శులు అమలు చేయాలని ఓ ప్రకటన విడుదల చేశారు. డీపీవో ప్రకటనలో కార్యదర్శులు నిర్వహించాల్సిన విధానాలను స్పష్టం చేశారు. గ్రామకంఠం, పంచాయతీలోని ఖాళీ స్థలాలు, లేఅవుట్లలో 10 శాతం స్థలాలను కాపాడే బాధ్యత కార్యదర్శులపై ఉందన్నారు. ప్రజా అవసరాలకు కేటాయించిన ఖాళీ స్థలాలను కాపాడి గ్రామ పంచాయతీల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకొనుట, స్వాధీనం చేసుకునే అధికారం కార్యదర్శులకు ఉందన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించి గ్రామ పంచాయతీల్లోని ఖాళీ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడవలసిన బాధ్యతను కార్యదర్శులకు డీపీవో గుర్తుచేశారు.
ముఖ్యంగా గ్రామ పంచాయతీలో ఆమోదించబడిన లేఅవుట్ గాని అనధికార లేఅవుట్లులో గాని ఉన్న 10 శాతం ఖాళీ స్థలాలను గ్రామ పంచాయతీ పేరున తక్షణమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయకపోయినా వాటిని గ్రామపంచాయతీ ఆధీనంలోకి తీసుకోవాలి.
ఖాళీ స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి అన్యాక్రాంతం కాకుండా చూడాలి.
అట్టి స్థలాల దగ్గర సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
పంచాయతీ రాజ్ పోర్టల్లో గ్రామ పంచాయతీ ఆస్తుల రిజిస్టర్లో గ్రామ పంచాయతీ ఆస్తులుగా నమోదు చేయాలి.
ఈ స్థలాలను ఫొటో తీసి డాక్యుమెంటేషన్ చేయాలి.
ఖాళీ స్థలాలు (పార్కు ఇతర అవసరాలకు కేటాయించబడినవి) ఆక్రమణకు గురవుతుంటే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకొని వాటిని తిరిగి గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకుని రక్షించాలి. అవసరమైతే పోలీసుశాఖ, ప్రభుత్వ న్యాయవాదుల సహాయం తీసుకోవాలి.
ఈ ఖాళీ స్థలాలలో వచ్చే హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలి.
గ్రామపంచాయతీల్లో ఉన్న ఖాళీ స్థలాలను కాపాడేందుకు సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ పరిధిలో స్థలాలను కాపాడేందుకు పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారుల సమన్వయంతో స్థలాలను కాపాడేందుకు సహకరించాలని కోరారు. ఖాళీ స్థలాల విషయంలో మండల పంచాయతీ అధికారులు గ్రామాల సర్పంచులకు కార్యదర్శులకు ఆఏశాలు జారీచేసి స్వాధీనం చేసుకున్న స్థలాలపై నివేదిక సమర్పించాలని అధికారులను జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు.