రామచంద్రాపురం, జనవరి 23 : కరోనా కట్టడికే రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వేను నిర్వహిస్తున్నదని ఆర్థిక, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా భారతీనగర్ జీహెచ్ఎంసీ డివిజన్లోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేను మంత్రి పరిశీలించారు. జ్వర సర్వే వివరాలను ఆయన పీహెచ్సీ వైద్యురాలు నాగరాజకుమారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వేను పరిశీలించి వ్యాక్సినేషన్పై ఆరాతీశారు. బస్తీ వాసులతో మాట్లాడారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కరోనా కట్టడికి వైద్యారోగ్య శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 55వేల బెడ్లు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఆక్సిజన్, మెడిసిన్ అందుబాటులో ఉన్నాయన్నారు. రెండు రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా 29లక్షల మందికి జ్వర సర్వే చేసినట్లు తెలిపారు. నాలుగైదు రోజుల్లో వందశాతం సర్వేను పూర్తి చేస్తామన్నారు. ప్రజలకు అండగా ప్రభుత్వం ఉన్నదని, ప్రజలు ఎలాం టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉంటే మెడికల్ షాప్ నుంచి మందులను తెచ్చుకొని వేసుకోవద్దని, వైద్యులను సంప్రదించి,వారి సూచనల మేరకు మందులు వాడాలన్నారు. వైద్య సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉన్నా చెప్పి మెడికల్ కిట్ను తీసుకొని వాడాలని సూచించారు. కార్పొరేటర్ దవాఖానలకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు.
లక్షణాలు ఉంటే దాచుకోకుండా ధైర్యంగా వైద్యులకు చెప్పి హోం క్వారంటైన్ పాటించాలన్నారు. గర్భిణులు కొవిడ్ బారిన పడితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్నదని, ప్రజలు సహకరిస్తే మన రాష్ట్రంలో కూడా కరోనా తగ్గు ముఖం పడుతుందని తెలిపారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ, వైద్యాధికారులు, బల్దియా అధికారులు, సిబ్బంది జ్వరం సర్వేను ముమ్మరంగా నిర్వహిస్తునందుకు మంత్రి అభినందనలు తెలిపారు. ఆర్సీపురం పీహెచ్సీ పరిధిలో రెండురోజుల్లోనే 500మందికి మెడికల్ కిట్లను అందజేసినట్లు డాక్టర్ నాగరాజకుమారి మంత్రికి తెలిపారు. మంత్రి వెంట పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్, సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్, భారతీనగర్, ఆర్సీపురం అధ్యక్షుడు బూన్, గోవింద్, మాజీ కార్పొరేటర్ అంజయ్య ఉన్నారు.
ఏమ్మా వ్యాక్సిన్ వేసుకున్నారా..
ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో జ్వర సర్వేలో భాగంగా మంత్రి హరీశ్రావు ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరించారు. ఓ మహిళను ఆప్యాయంగా పలుకరించారు. ఏమ్మా రెండు డోస్ల వ్యాక్సిన్ వేసుకున్నావా..ఆరోగ్యం ఎలా ఉంది..ఇంట్లో అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారా అని అడిగారు. ఆ తీసుకున్నాం సార్..అందరం బాగున్నాం అని ఆమె బదులిచ్చింది.
మంత్రికి కృతజ్ఞతలు..
ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియా వాసులకు ఇండ్ల పట్టాలను మంజూరు చేయించినందుకు గాను ఫెన్సింగ్ ఏరియా వాసులు మంత్రి హరీశ్రావుకి కృతజ్ఞతలు తెలిపారు. 40ఏండ్లుగా ఫెన్సింగ్ ఏరియాలో నివాసముంటున్న తమకు ఏ ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇవ్వలేదని, తమరి సహకారంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇండ్ల పట్టాలను మంజూరు చేసిందని, ఇప్పుడు మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు మంత్రికి తెలిపారు.