సిద్ధిపేట : రైతే కేంద్ర బిందువులుగా రైతు వేదికలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. నాల్గవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామంలో శనివారం వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని, గ్రామ పంచాయతీ నర్సరీని మంత్రి ప్రారంభించారు. అంతకుముందు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. సెగ్రీగేషన్ షెడ్డులో సేంద్రీయ ఎరువుల తయారీ విధానం, నర్సరీలో మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. అనంతరం పొన్నాల గ్రామ పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ లో స్టీల్ బ్యాంకును ప్రారంభించారు. ఓపెన్ జిమ్, స్మశాన వాటిక, రైతు వేదికను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
సిద్ధిపేట పట్టణీకరణ భవిష్యత్ పొన్నాల వైపు ఉన్నదని, కొత్త కలెక్టరేట్, రైల్వే లైను మీదుగా పోవడంతో శరవేగంగా పొన్నాల పట్టణాభివృద్ధి జరుగుతున్నదని మంత్రి చెప్పారు. పొన్నాల టూ గుడికందుల వరకు పొన్నాల రాజీవ్ రహదారి మీదుగా కిష్టసాగర్, ఏన్సాన్ పల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్ మీదుగా గుడికందుల వరకూ డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.14.16 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
రాష్ట్రంలో తొలిసారిగా గొర్రెలు, పశువుల హాస్టల్స్ నిర్మించి ఆదర్శంగా నిలిచినట్లు మంత్రి తెలిపారు.
వ్యవసాయశాఖ, రైతుబంధు సమితి నాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతు వేదికలలో కూర్చుని ఆయిల్ ఫామ్, వరి వెదజల్లే పద్ధతి, విత్తనోత్పత్తి- విత్తన సాగు సీడ్లపై అవగాహన కల్పిస్తూ రైతులకు మేలు జరిగేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయిల్ ఫామ్ తోటలు పెంపునకు రైతులు ముందుకు రావాలని కోరారు. పొన్నాలలో ప్లాస్టిక్ నివారణ జరిపేందుకే స్టీల్ బ్యాంకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్లాస్టిక్ నివారణ అమలయ్యేలా చూడాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.