సిద్దిపేట : సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ జలాశయం సమీపంలోని కొండపాక రిజర్వ్ ఫారెస్ట్లో చిరుత సంచరిస్తున్నది. నల్లజుట్టు చిరుత (పాంథర్) అటవీ పరిధిలో సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గతేడాది అంకిరెడ్డిపల్లి చెరువు వద్ద ఓ చిరుత సంచారాన్ని గుర్తించామని, ప్రస్తుతం రెండు చిరుతలు అడవీ ప్రాంతంలో సంచరిస్తున్నాయని జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. చిరుత పిల్లలు సైతం సంచారిస్తున్న ఆనవాళ్లను గుర్తించామని ఆయన తెలిపారు. అంకిరెడ్డిపల్లి చెరువు సమీపంలో సంచరించే చిరుతలు అప్పుడప్పుడు అడవీ సరిహద్దులకు వస్తున్నాయని పేర్కొన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అటవీ ప్రాంతంలోకి ఎవరూ వెళ్లవద్దని సూచించారు.