సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, ఏప్రిల్ 27: బీజేపీ నాయకులు చెబుతున్న కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. కరోనాలాంటి విపత్కర సమయంలో కనబడని నాయకులు, నేడు ఓట్లు అనగానే వచ్చి, ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు చేసే అబద్ధపు ప్రచారాలు, కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. రూ.100 ఉన్న వంటనూనెను బీజేపీ ప్రభుత్వం రూ.200 చేసిందన్నారు. కొందరు బీజేపీ నాయకులు కేంద్రం సిద్దిపేటకు రూ.135 కోట్లు ఇచ్చిందంటున్నారని, రూ.135 కూడా ఇవ్వలేదన్నారు.
ఇంటి స్థలం ఉన్న వారందరికీ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. చాలా ప్రాంతాల నుంచి వచ్చి సిద్దిపేట అభివృద్ధిని చూసి నేర్చుకొనిపోయారన్నారు. సిద్దిపేట అభివృద్ధికి అధ్యయన కేంద్రమని, అవార్డుల్లో సిద్దిపేట ఆదర్శపేట అన్నారు. కౌన్సిలర్ అనే వాళ్లు మీకు నాకు వారధి లాంటి వాడు. మీకు ఏ సమస్య పరిష్కారం కావాలన్నా, సిద్దిపేట అభివృద్ధి మరింత జరుగాలన్నా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. నాడు ఉద్యమంలో మొదట ఉన్నామని, నేడు గెలుపులో కూడా ముందుండాలన్నారు. 43 వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ ఖాతా కూడా తెరవరని చెప్పారు. 30వ తేదీన జరిగే పోలింగ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఆదర్శంగా ఉన్న సిద్దిపేట అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉందని, నిరంతరం ప్రజల మధ్యనే ఉండే నాయకుడు మంత్రి హరీశ్రావు అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఏ పని కావాలన్నా సులువుగా ఉంటుందన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని 1వ వార్డులో టీఆర్ఎస్ జెండాను మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి మంగళవారం చివరి రోజు కావడంతో మంత్రి హరీశ్రావు జోరుగా ప్రచారం నిర్వహించారు. ఏకదాటిగా ఒకేరోజు 12 వార్డుల్లో ప్రచారం చేశారు. ఉదయం 1వ వార్డు నుంచి ప్రారంభమైన ప్రచారం, 16, 32, 2, 18, 37, 6, 7, 15వ వార్డులతో పాటు చివరగా 23, 24, 25వ వార్డుల్లో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రచారం ముగించారు. ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనల ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రచారం ముగిసింది.
సిద్దిపేట కమాన్, ఏప్రిల్ 27: సిద్దిపేటలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకే సిద్దిపేట జిల్లా అర్చక సమాఖ్య సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు కలకుంట్ల వెంకటనర్సింహాచార్యులు అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగా సిద్దిపేటకు చెందిన బ్రాహ్మణులకు కోటి రూపాయల వరకు లబ్ధిపొందారన్నారు. ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు రూ.50 లక్షలు బ్రాహ్మణ పరిషత్కు మంజూరు చేయించారన్నారు. బ్రాహ్మణోత్తములు ఈ విషయాన్ని గమనించాలని… టీఆర్ఎస్కే ఓటు వేద్దామని కోరారు.