నాలుగు రోజులు మంత్రి హరీశ్రావు విస్తృత ప్రచారం
గడపగడపకూ గులాబీ సైన్యం
ప్రచారం నిర్వహించిన ప్రతిపక్ష నేతలు
ఈ నెల 30న పోలింగ్.. మే 3న కౌంటింగ్
సిద్దిపేట, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. కొవిడ్ దృష్ట్యా ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా ఎన్నికల ప్రచారం పోలింగ్కు 72 గంటల ముందే, మంగళవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారం పరిసమాప్తమైంది. ఈ నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. కొవిడ్ నిబంధనలకు అనుగణంగా ఎన్నికల ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తుంది. సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 వార్డులకు గానూ మొత్తం 236 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటిలో అన్ని వార్డుల్లోనూ టీఆర్ఎస్ అభ్యుర్థులు బరిలో ఉన్నారు. ఇక బీజేపీ- 40, సీపీఐ- 01, సీపీఎం-01, కాంగ్రెస్ -30, ఏఐఎంఐఎం-04, ఇతర రిజిష్టర్ పార్టీ-01, స్వతంత్రులు-116 ఎన్నికల బరిలో ఉన్నారు. కేవలం ఐదు రోజులే ప్రచారానికి గడువు ఉండడంతో అభ్యర్థులు తమ ఓటర్లను కలిసి ఓట్లు వేయాలని అభ్యర్థించారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ముఖ్య నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో అన్ని తానై ఎన్నికల ప్రచారాన్ని మంత్రి హరీశ్రావు నిర్వహించారు. సిద్దిపేటలో చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నాలుగైదు రోజుల పాటు అన్ని వార్డుల్లో మంత్రి విస్రృత ప్రచారం నిర్వహించారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సహకారంతో మంత్రి చేపట్టిన అభివృద్ధి పనులను వివరించే పుస్తకాలను ఇంటింటికీ పంచారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సిద్దిపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి వార్డులో వంద మందికి ఒక ఇన్చార్జి ఉండి ప్రతి ఓటరును కలిసి టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ తరుపున మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, రసమయి బాలకిషన్ ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, ఎండీ ఫరీదుద్దీన్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో పాటు సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మలతో పాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ ముఖ్యనాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
బీజేపీ తరుఫున దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్రావు అన్ని వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించగా, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యదర్శి తరుణ్ చుగ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు తదితర నేతలు తమ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి తదితర నేతలు ప్రచారంలో పాల్గొనగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైస్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గజ్వేల్అర్బన్, ఏప్రిల్27: గజ్వేల్ మున్సిపాలిటీలోని 12వ వార్డుకు జరుగుతున్న కౌన్సిలర్ ఎన్నికల ప్రచారం మంగళవారంతో ముగిసింది. నాలుగైదు రోజులుగా అభ్యర్థులంతా హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రానికి ప్రచార కార్యక్రమాలు ముగిశాయి. అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, సీనియర్ నాయకులు డాక్టర్ యాదవరెడ్డిలతో పాటు కౌన్సిలర్లు, నాయకులంతా 12వ వార్డులోని వీధివీధి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్ 27 : తమను ఓటు వేసి గెలిపిస్తే ప్రజాక్షేత్రంలో ఉండి సేవ చేస్తామని టీఆర్ఎస్ అభ్యర్థులు చివరి రోజు ఇంటింటా ప్రచారం చేశారు. మంగళవారంతో ప్రచారం ముగుస్తున్నందున ఓటర్ల వద్దకు వెళ్లి సిద్దిపేటలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరించారు. 22వ వార్డు అభ్యర్థి ఎడ్ల అరవింద్రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించగా, ఆయనకు మద్దతుగా ఎమ్మెల్సీ కూర రఘౌత్తంరెడ్డి పాల్గొన్నారు. మంత్రి హరీశ్రావు ద్వారానే సిద్దిపేట అభివృద్ధి సాధ్యమని, వార్డు అభివృద్ధికి ఆయన సహకారంతో నిరంతరం కృషి చేస్తానన్నారు. 23వ వార్డు అభ్యర్థి నాయకం లక్ష్మణ్ వార్డులో ర్యాలీ తీసి, ఓటు అభ్యర్థించారు. గడపగడపకూ వెళ్లి తనను ఆశీర్వదించాలని కోరారు. ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 36వ వార్డు అభ్యర్థి చందిరెడ్డి రూపా రాజశేఖర్రెడ్డి వార్డులో పర్యటించి తమకు ఓటు వేయాలని కోరారు.