దుబ్బాక అభివృద్ధి సిగలో మరో మణిహారం చేరనున్నది. రూ.4కోట్లతో అధునాతన హంగులతో దుబ్బాకలో బస్టాండ్ భవనం నిర్మాణం కానున్నది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక చొరవతో దుబ్బాక నడిబోడ్డున సర్వంగ సుందరంగా బస్టాండు భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. సిద్దిపేట జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే.. ఓ మోడల్ బస్టాండుగా నిలిచిపోనున్నది.
దుబ్బాక నడిబొడ్డున నిర్మించనున్న మోడల్ బస్టాండుతో పట్టణ రూపురేఖలు మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న బస్టాండు సుమారు 40 ఏండ్ల కిందట నిర్మించింది కావడంతో ఇప్పుడు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. దీంతో ప్రతి రోజు బస్టాండుకు వచ్చే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంపై స్పందించిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి బస్టాండు నిర్మాణం కోసం రూ.4 కోట్లు మంజూరు చేశారు. దుబ్బాక అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించి తన అభిమానాన్ని చాటుకున్నారు. బస్టాండు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో దుబ్బాక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు.. భారీ బడ్జెతో.. ప్రయాణికులకు బస్టాండులో కావల్సిన అన్ని వసుతులు కల్పించటంతో పాటు సర్వంగ సుందరంగా నిర్మించేందుకు ప్రత్యేక ప్లాన్తో అధికారులు పనులు చేపడుతున్నారు.
దుబ్బాకలో నిర్మిస్తున్న బస్టాండు భవన నిర్మాణాన్ని రాష్ట్రంలోనే మోడల్గా ఉండేందుకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అధునాతన హంగులతో బస్టాండును నిర్మించేందుకు తాను ఓ ప్రైవేట్ సంస్థతో నమూనా చిత్రాలను తీయించి విడుదల చేశారు. ఒక ఎకరాకు పైగా విస్తీర్ణంలో ఉన్నా బస్టాండు స్థలంలో.. ఒక వైపు నుంచి బస్సులు వచ్చేందుకు (ఇన్), మరో వైపు నుంచి బస్సులు బయటకు (జౌట్) వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు. బస్టాండుకు వచ్చే ప్రయాణికులు తమ ద్విచక్ర వాహనాలకు పార్కింగ్, నడిచి వెళ్లేందుకు ఫుట్పాత్ మార్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. బస్టాండులో బస్సులు ప్లాట్ఫారం వద్దకు చేరుకునేందుకు, ప్రయాణ ప్రాంగణంలో బస్ ఎక్కేందుకు వీలుగా ప్లాట్ఫారం నిర్మాణం, బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు కుర్చీలు, తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎకరానికి పైగా ఉన్న స్థలంలో విశాలమైన భవనంతో పాటు షాపింగ్ కాంప్లెక్స్, ప్రైవేట్ వాహనాల పార్కింగ్, పచ్చని మొక్కలతో ప్రశాంత వాతావరణం కల్పించనున్నారు. బస్టాండు భవనంలో 346 చ దరపు అడుగుల స్థలంలో గ్రౌండ్ఫ్లోర్, మెజనైన్ ఫ్లోర్లు, 615 చదరపు అడుగుల స్థలంలో ఫస్ట్ఫ్లోర్ను నిర్మించనున్నారు. ఇదిలా ఉండ గా.. దుబ్బాక బస్ డిపోలో 36 బస్సులు కొనసాగుతున్నాయి. ప్రసుత్తం దుబ్బాకకు.. దుబ్బాక బస్డిపోతో పాటు సిద్దిపేట, గజ్వేల్ప్రజ్ఞాపూర్, కామారెడ్డి, పికెట్ డిపోలకు చెందిన బస్సులు సర్వీసు అందిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా ప్రజలేకాకుండా మెదక్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల ప్రజలు నిత్యం దుబ్బాకకు వస్తూ.. వెళ్తుంటారు. దీంతో నాలుగు జిల్లాల ప్రజలకు మెరుగైన వసతులు అందనున్నాయి.
దుబ్బాకలో మోడల్ బస్డాండు భవన నిర్మాణంతో.. పట్టణ రూపురేఖలు మారనున్నాయి. సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన దుబ్బాకలో మోడల్ బస్టాండు నిర్మించి, ప్రయాణికులకు అన్ని వసతులు కల్పించే అవకాశం రావటం చాలా సంతోషంగా ఉంది. దుబ్బాకకు పక్క జిల్లాల నుంచి మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తాను. ప్రజల సమస్యలను పరిష్కరించటమే కాకుండా.. వారి అవసరాలను గుర్తించి కావల్సిన సేవలందించడమే మా ప్రభుత్వ లక్ష్యం. భారీ బడ్జెట్తో దుబ్బాకలో మోడల్ బస్టాండును నిర్మించనున్నాం. బస్టాండుతో పాటు పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. బస్టాండు నిర్మాణంతో వ్యాపార పరంగానే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా మారనున్నది. దుబ్బాక ప్రజలతో పాటు పక్క జిల్లాల ప్రయాణికులకు మెరుగైన వసతులు అందనున్నాయి.
– మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి