సిద్దిపేట : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలో నూతన బస్టాండ్ నిర్మాణంతోపాటు పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం మరో 3 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90.5 శాతం మందికి రేషన్ బియ్యం అందుతున్నాయని వెల్లడించారు. ఏడాదికి రూ. 2700 కోట్లను ఇందుకు ఖర్చు చేస్తున్నామని అన్నారు.
ప్రతి పేదవారికి రేషన్ బియ్యం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ‘సాగుకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నదని దేశంలో తెలంగాణ సర్కార్ మాత్రమే. పేదింటి ఆడబిడ్డల వివాహానికి కల్యాణలక్ష్మి పథకం కింద ప్రభుత్వం రూ.లక్ష ఇస్తున్నది. సంక్షేమంలో దేశానికి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం’ అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
అంబేద్కర్, జగ్జీవన్ రామ్ భవనాల నిర్మాణాలకు రూ.కోటి మంజూరు చేస్తామని తెలిపారు.
దళిత బంధు పథకం కొత్తగా రాలేదని 2021 అసెంబ్లీ బడ్జెట్లోనే ప్రవేశ పెట్టామని గుర్తుచేశారు. దుబ్బాకలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే దళిత కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థికసాయం చేస్తామని వెల్లడించారు. వచ్చే రెండేళ్లలో దళిత బంధు పథకాన్ని సమగ్రంగా పూర్తి చేస్తామన్నారు. దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి మాత్రం ఆపబోమని అన్నారు. దుబ్బాకలో అసంపూర్తిగా పనులన్నీ పూర్తి చేస్తామని, నూతనంగా నిర్మించ తలపెట్టిన బస్టాండ్ నిర్మాణానికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. రైతులు పామాయిల్ సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.