చేర్యాల, అక్టోబర్ 20 : మండలంలోని పాత దొమ్మాట గ్రామంలో చాళుక్యుల ఆనవాళ్లు ఉన్నట్లు తాము గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. శ్రీనివాస్ పాత దొమ్మాట గ్రామంలో బుధవారం పర్యటించి పలు చారిత్రక అనవాళ్లను విలేకరుల దృష్టికి తీసుకువచ్చారు.
దొమ్మాట గ్రామం మొదటగా మోయతుమ్మెద వాగు, కృష్ణ చెరువుకు మధ్య భాగంలో ఉండేదని, వాగు, చెరువు ఏక కాలంలో ఉప్పొంగడంతో గ్రామం జలదిగ్భందం అయిందన్నారు. వాగు ఒడ్డునగల పాత ఊరిలో గద్దె పై హనుమాన్ విగ్రహం ఉందని, హానుమాన్ విగ్రహం ముందు పానపట్టం మీద శిరస్సు, వెనక లింగం ఉన్నట్లు తెలిపారు.
బహుశ ఆత్మార్పణ సందర్భంగా శిరస్సును అర్పించింది కావొచ్చన్నారు. దాని కింద గజ్జెల పట్టెడతో అలంకరించిన శిథిలమైన నంది చాళుక్యుల కాలంనాటిది, కొంచెం ముందుకు ఒక శిథిల వైష్ణవాలయం ఉందని, దేవాలయానికి ఇరువైపులా వైష్ణవ ద్వారపాలకులున్నట్లు వివరించారు.
ద్వారశాఖకు లలాటబింబంగా శంఖు, చక్రాల మధ్య తిరునామాలు చెక్కబడి ఉన్నాయని, గుడి పక్కన మట్టిగోడలతో పాత గ్రామం ఆనవాళ్లు కనిపిస్తున్నట్లు చెప్పారు. అక్కడే కుమ్మరి ఆవం, ఇనుము చిట్టెం తమకు లభించినట్లు తెలిపారు.
రామాలయం నుంచి తీసుకువెళ్లిన కొన్ని విగ్రహాలు హనుమాన్ దేవాలయంలో ప్రతిష్టించారు. వాటిలో అల్వార్ల విగ్రహాలు, విష్ణుమూర్తి శంఖు, చక్రాలతో కుడి చేయి వరదహస్తం, ఎడమచేయి అభయహస్తంతో విష్ణుమూర్తి విగ్రహం ఉన్నట్లు పేర్కొన్నారు.