సిద్దిపేట : కొవిడ్-19 పాజిటివ్కు గురై హోం ఐసోలేషన్లో ఉన్న కానిస్టేబుల్ను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హైదరాబాద్ రేంజ్) స్టీఫెన్ రవీంద్ర గురువారం స్వయంగా వెళ్లి పరామర్శించారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేసే ప్రమీద్ గౌడ్(36) తొమ్మిది రోజులక్రితం కరోనా బారిన పడ్డాడు. పాజిటివ్గా తేలడంతో హోం ఐసోలేషన్లో ఉన్నాడు. కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న సిబ్బందిలో ఆత్మస్థైర్యం నింపేలా ఐజీ పలు జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. కానిస్టేబుల్ ప్రమీద్ గౌడ్ ఇంటికి స్వయంగా వెళ్లిన ఐజీ స్టీఫెన్ రవీంద్ర భౌతికదూరం పాటిస్తూ అతడిని పరామర్శించారు. అధైర్యపడొద్దన్నారు. డ్రై ఫ్రూట్స్, పండ్లతో కూడిన గిఫ్ట్ ప్యాక్ను అందించారు.
పర్యటనలో భాగంగా ఐజీ గజ్వేల్లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను సందర్శించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తన విక్రేతలపై పటిష్ట నిఘా పెట్టాల్సిందిగా సీపీ డి. జోయల్ డేవిస్కు సూచించారు. లాక్డౌన్ అమలుతీరు పరిశీలనలో భాగంగా ముత్రాజ్పల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను స్టీఫెన్ సందర్శించారు. అనంతరం ఐజీ చేర్యాలలోని దొమ్మాట గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో కొవిడ్ మొదటి దశలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. సెకండ్ వేవ్లో 16 కేసులు నమోదు కాగా వారంతా హోం ఐసోలేషన్లో ఉంటూ కోలుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
ఏఎన్ఎం అన్నపూర్ణ, ఆశా కార్యకర్త స్వప్న, పంచాయతీ సెక్రటరీ రాజు, శానిటేషన్ వర్కర్స్ రామచంద్రం, లక్ష్మి నర్సమ్మ, విలేజ్ పోలీసు ఆఫీసర్ స్వప్న సేవలకు గుర్తింపుగా వారికి ఐజీ గిఫ్ట్ ప్యాక్లను అందజేశారు. లాక్డౌన్ సమయంలో వీరు చేస్తున్న సేవలను ఐజీ ప్రశంసించారు. అదేవిధంగా లాక్డౌన్ ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐజీ వెంట సీపీ జోయల్ డేవిస్, హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, గజ్వేల్ ఏసీపీ పి.నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.