సిద్దిపేట : మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. స్వరాష్ట్రంలో మహనీయుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తూ.. వారి గొప్పతనాన్ని భావితరాలకు తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ క్రమంలో చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం మనకు గర్వకారణమని అన్నారు. సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు సర్కిల్లో ఉన్న ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసుకున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ఐలమ్మ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేస్తామన్నారు. కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ఎంబీసీ కార్పొరేషన్ ద్వారా రజకులకు పెద్ద ఎత్తున రుణాలు, స్వయం ఉపాధి యూనిట్లను మంజూరు చేస్తామన్నారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, ఆర్డీవో అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం పాల్గొన్నారు. అనంతరం బీసీ స్టడీ సర్కిల్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఎమ్మెల్సీ ఫారూఖ్స్సేన్, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.