సిద్ధిపేట: ‘స్వరాష్ట్రంలో అభివృద్ధి సాధించి పెట్టిన ఘనత మన సిద్దిపేటకు ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ఇది పురిటి గడ్డ. నాటి ఉద్యమానికి, నేటి అభివృద్ధికి దిక్సూచి మన సిద్దిపేట. టీఆర్ఎస్ పార్టీ 20 ఏళ్ళ చరిత్రలో మన సిద్దిపేటకు గొప్ప ప్రాధాన్యత ఉంది’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పొన్నాల జిల్లా పార్టీ కార్యాలయంలో సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘నాడు సిద్దిపేట ప్రజల దీవెనతో పదవులను గడ్డిపోచల్లా వదలి పార్టీ పెట్టిన విషయం మీకు తెలిసిందే. ఉద్యోగ గర్జన, జైల్ భరో కార్యక్రమాలకు వేదిక మన సిద్దిపేట. జైల్ భరో నుండి ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేసి మన కేసీఆర్.. 2009 నవంబర్ 29 నాడు సిద్దిపేట రంగదాంపల్లి వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. అదే రోజు కేసీఆర్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో వేశారు. మనం అంత మెదక్ జైల్లో ఉన్నాం. నాడు రాష్ట్ర సాధనకు.. నేడు అభివృద్ధికి దిక్సూచి మన సిద్దిపేట అని సగర్వంగా చెప్పుకొనే ఒక గొప్ప సందర్భం ఇది. ఇంత కంటే మన ప్రజలకు, మనకు అదృష్టం, గౌరవం ఏం ఉంటుంది?’ అని హరీశ్ రావు అన్నారు.
నాటి తెలంగాణ కరువు కన్నీళ్లతో అల్లాడుతుండేదని, నేడు కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతోందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారి అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, అందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీకి అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన ఉందని వెల్లడించారు. ఆ దిశగా టీఆర్ఎస్ పార్టీలో అందరిని భాగస్వామ్యం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా కొత్త తరం, యువతను ప్రోత్సాహించాలని, ప్రతి కమిటీలో మహిళలను భాగస్వాములు చేయాలని, గ్రామ గ్రామాన పార్టీ గ్రామ కమిటీలు అనుబంధ కమిటీలు పటిష్టంగా చేయాలని చెప్పారు.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే విద్యార్తి, యూత్కి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. కమిటీలు వేసిన అనంతరం ప్రతి మూడు నుండి 6 నెలలకు ఒకసారి కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం పెట్టి అందరిని కలుస్తానని హరీశ్ అన్నారు. ఈ నెల 29న వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు మళ్ళీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుందామని కార్యకర్తలకు చెప్పారు. సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి రోజు రెండు మూడు వార్డుల చొప్పున కమిటీలు వేయడం జరుగుతుందన్నారు.
కార్యకర్తలు అంటే నాయకుడి కుటుంబ సభ్యులు
కరోనాతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని ఈ కార్యక్రమంలో హరీశ్ రావు ప్రకటించారు. ప్రతి కార్యకర్తను తాము కాపాడుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంటే నాయకుడి కుటుంబ సభ్యులని, పార్టీ కార్యకర్తలు తన కుటుంబ సభ్యులతో సమానమని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతి ఒక్కరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్పారు. 20 ఏళ్ల నుండి పార్టీకి పని చేస్తున్న కార్యకర్తలను, నాయకులను, పాత కొత్తా అనే భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ అండగా ఉంటామన్నారు.
కార్యకర్తలతో కల్సి ఆత్మీయంగా అన్నం వడ్డించిన హరీశ్ రావు
ఎప్పుడూ హడావిడి కార్యకర్తలతో మనసు విప్పి మాట్లాడే తీరిక దొరక్క సంవత్సరం నుండి ఎన్నికలతో బిజి బిజీగా ఉన్న హరీశ్ రావు ఈరోజు సిద్దిపేటలో కాసేపు కార్యకర్తలతో కల్సి ఆత్మీయతను పంచుకున్నారు. వారికి తానే స్వయంగా అన్నం వడ్డించి ‘నేనున్నా’ అనే ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా మంత్రితో ముచ్చటించిన కార్యకర్తలు తమ సంతోషాన్ని పంచుకున్నారు.