సిద్దిపేట : ఈ ప్లవ నామ సంవత్సరం వస్తు వస్తూనే సిద్దిపేటలోని నిరుపేదల జీవితాల్లో సంతోషాలను తీసుకువచ్చింది. సిద్దిపేటలో ఏన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో నివసిస్తున్న 232 మంది నిరుపేద కుటుంబాలకు మంత్రి హరీశ్రావు ఉగాది పర్వదినం సందర్భంగా డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేశారు. సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఇళ్ల పత్రాలను లబ్దిదారులకు అందజేశారు. ఇళ్ల పట్టాలతో పాటు నూతన వస్ర్తాలను బహుకరించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్దిదారుల్లో 15 మంది వికలాంగులు ఉన్నారు.
సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపూర్ వద్ద కేసీఆర్ నగర్ పేర ప్రభుత్వం 2,460 ఇళ్లను నిర్మించిన సంగతి తెలిసిందే. మొత్తం 11 వేల దరఖాస్తులు రాగా అధికారులు ఐదు దశల్లో వీటిని స్క్రూట్నీ చేసి పక్కాగా లబ్దిదారులను ఎంపిక చేసి విడుదల వారీగా వారికి డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలోని ఇళ్లు లేని ప్రతిఒక్కరికి ప్రభుత్వం ఇళ్లు కల్పించనున్నట్లు తెలిపారు.
లబ్దిదారులను గుర్తించి చాలా కాలం అవుతున్నప్పటికీ అధికారుల పక్కా స్క్రూట్నీలో భాగంగా కొంత ఆలస్యం జరిగిందన్నారు. లబ్దిదారులు తమకు కేటాయించిన ఇళ్లను అమ్మడం గానీ, అద్దెకు ఇవ్వడం గానీ చేస్తే వారి నుండి ఇళ్లను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. అద్దె కట్టే బాధలు పోయాయని ఇకపై జీవితంలో మంచి ఉన్నతస్థితిలోకి రావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్, మున్సిపల్ చైర్మన్ కె.రాజనర్సు, ఇతరులు పాల్గొన్నారు.