కొండపాక : నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. కొండపాక మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం మండలంలోని దుద్దెడలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన సన్మానించి మాట్లాడారు.
కొవిడ్ పరిస్థితుల అనంతరం ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. వారికి గుణాత్మకమైన విద్యను అందించాలని, పిల్లలు బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. ప్రభుత్వ విద్య పటిష్టతకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని తెలిపారు.
అనంతరం జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా నుంచి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక కావడం ఎంతో గర్వకారణమన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ, జడ్పీటీసీ అశ్విని, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దేవి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేందర్, ఎంఈవో శ్రీనివాస్రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా 45 మంది ఉపాధ్యాయులను సత్కరించారు.