జగదేవ్పూర్ : బోర్ మోటార్ ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు కరెంట్ తీగ తగిలి రైతు మృతి చెందిన ఘటన మండలంలోని అంతాయగూడెం గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హేమ కొండయ్య (65) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.
రోజూ మాదిరిగానే గురువారం 10 గంటల సమయంలో పొలం పనుల నిమిత్తం బావి దగ్గరకెళ్లి బోరు మోటారు నీరు పోయకపోవడాన్ని గమనించాడు. అక్కడే ఉన్న స్టార్టర్ డబ్బా తెరిచి వైర్లను సరిచేస్తుండగా అతడి కుడి చేతికి వైర్ తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. కొండయ్యకు షాక్ తగిలిన విషయాన్ని గమనించిన చుట్టు పక్కల ఉన్న రైతులు ఈ విషయాన్ని మృతుడి కుటుంబసభ్యులకు తెలిపారు. మృతుడి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజ్వేల్ ఏరియా దవాఖానకు తరలించినట్లు ఎస్ఐ పరమేశ్వర్ తెలిపారు.