సిద్దిపేట, అక్టోబర్ 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి) ప్రత్యామ్నాయ పంటల సాగుపై సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన సమావేశం రైతుల శ్రేయస్సు కోసమే నిర్వహించాం. యాసంగి సీజన్లో రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని విత్తన డీలర్లకు సూచించామని సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.
దీనిని వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అసత్యాలను, అర్థ సత్యాలను కొద్దిమంది ఉద్దేశ పూర్వకంగా ప్రచారం చేయడం సరికాదన్నారు. రైతులు నష్టపోయే విధంగా నకిలీ విత్తనాలు రైతులకు విక్రయిస్తే నకిలీ విత్తనాలు విక్రయించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పానన్నారు. అందుకు డీలర్లు సహకరిస్తామన్నారని వివరించారు.
యాసంగిలో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తే రైతులకు ఎక్కువ లాభం జరుగుతుందని చెప్పామన్నారు. పంటల మార్పిడి వల్ల దిగుబడి ఎక్కువగా ఉండడంతో పాటు బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశంతో వ్యవసాయ అధికారులు ప్రతి రైతును కలిసి రైతులను చైతన్యం చేయాలని దిశా నిర్దేశం చేశామన్నారు. తాను చెప్పిన అంశాలను వక్రీకరించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేశారన్నారు.