బెజ్జంకి: స్థానిక ఎంపీగా ఉండి మండలానికి నిధులు ఇవ్వని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు మండలంలో అడుగుపెట్టే అర్హత ఉందా అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. శనివారం ఆయన మండల కేంద్రంలో రూ.40 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి సత్యార్జున గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఎంపీ నిధులతో మండలంలో చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని స్థానిక ఎంపీని డిమాండ్ చేశారు. ప్రజలపై అంత ప్రేమ ఉంటే ప్రధానిని ఇక్కడికి తీసుకొచ్చి మండలానికి రూ.200 కోట్లు కేంద్రం నుంచి తీసుకురాలేరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో మా వాటా ఉందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారని, మనం పన్నులు కడితేనే కదా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తున్నదని విమర్శించారు.
సంగ్రామ యాత్రనో, విహార యాత్రగానో మండలానికి వస్తున్న బండి సంజయ్ దానిని అభివృద్ధి సందర్శన యాత్రగా మాల్చుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మండలానికి వస్తున్న బండి సంజయ్ మండలానికి చేసిన అభివృద్ధి ఎంటో, ఎన్ని నిధులు ఇస్తారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై చేస్తున్న వ్యాఖ్యలపై మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. అసభ్యంగా మాట్లాడితే నాలుకలు కొస్తామని హెచ్చరించారు. నియోజకవర్గాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న తమపై అసభ్యంగా మాట్లాడితే ప్రజలే గ్రామాల నుంచి తరిమికొడుతారన్నారు.
ప్రతి గ్రామంలో అర్హులందరికీ డబుల్ బె డ్రూం ఇండ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రామాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతాక్రమంగా గ్రామాల వారీగా 19 గ్రామాల్లో కేసీఆర్ ఫంక్షన్ హాళ్లు, అన్ని గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాలు, కుల సంఘాల భవనాల నిర్మా ణాలు, సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని, స్టేడియాల్లో పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలనే ఆలోచనతో రూ.2 కోట్లు, బెజ్జంకి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించామని వివరించారు. రానున్న రోజుల్లో దళితబంధు పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ మండలాధ్యక్షుడిగా ఎన్నికైన మహిపాల్రెడ్డి, ఇతర కమిటీల సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. యూత్ అధ్యక్షుడిగా బిగుళ్ల మోహన్, బీసీ సెల్ అధ్యక్షుడిగా చెప్యాల సంతోష్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తిరుమల, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మహేశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బాబుమీయలను ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.