ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను త్వరగా పూర్తి చేయాలి
సిద్దిపేట అర్బన్ : జిల్లాలో వివిధ దశల్లో ప్రగతిలో ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలో ఇండ్ల నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, మౌలిక సదుపాయాల కల్పన పై రెవెన్యూ డివిజన్ అధికారులు, రహదారులు, భవనాలు, ఈడబ్ల్యూడీసీ, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ పర్యవేక్షక, కార్యనిర్వహక ఇంజినీర్లు, అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లతో ఐడీఓసీలో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట నియోజకవర్గంలో ఇప్పటికే 2621 ఇండ్లు, ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయించగా 835 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 270 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికే 292 ఇండ్లు, ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయించగా, 1922 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, 716 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. జనగామ నియోజకవర్గంలో 117 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, 141 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇప్పటికే 1124 ఇండ్లు, ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయించగా, 2364 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, 1642 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతి ఉన్నాయన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 168 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, 204 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో 168 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉండగా, 22 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు. మొత్తం జిల్లాలో ఇప్పటికే 4037 ఇండ్లు ఇండ్లులేని నిరుపేదలకు కేటాయించగా, 5504 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 2994 ఇండ్లు వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నాయన్నారు.
ప్రారంభానికి సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లలో విద్యుత్, తాగునీరు, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం చేస్తే గుత్తేదారులను తప్పించి బాగాపని చేసే కాంట్రాక్టర్లకు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. మౌలిక సదుపాయాలతో నిర్మాణం పూర్తయిన ఇండ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో పెండింగ్లో ఉన్న ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక వచ్చే 3 వారాల్లో పూర్తి చేయాలన్నారు.
జిల్లా అధికారులు పర్సనల్రెస్పాన్స్ బిలిటీగా భావించి క్షేత్రస్థాయిలో విచారణ సమగ్రంగా చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపట్టాలన్నారు. ప్రభుత్వం సిద్దిపేట పట్టణానికి కొత్తగా మంజూరు చేసిన వెయ్యి డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్నగర్కు సమీపంలోనే నిర్మాణం చేపట్టనున్న దృష్ట్యా సంబంధిత ఇండ్లకు టెండర్ ఫైనలైజ్ చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ముజమ్మీల్ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి బి.చెన్నయ్య, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఇంజనీరింగ్ విభాగాల ఎస్ఈ, ఈఈ, డీఈఈలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీవోలు పాల్గొన్నారు.