సిద్దిపేట అర్బన్ : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి హరీశ్రావు సిద్దిపేట జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, వైద్య శాఖ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వ్యాధుల సమాచారం, బాధితులకు అందుతున్న వైద్య సేవల వివరాలను వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 14 డెంగీ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్యాధికారి మనోహర్ తెలిపారు. చికెన్గున్యా, మలేరియా కేసులు నమోదు కాలేదని, వైరల్ ఫీవర్ కేసులు అధికంగా రిపోర్టు అవుతున్నట్లు మంత్రికి తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ సీజనల్ జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. అనుమానితులకు తక్షణమే జ్వర పరీక్షలు చేసి నిర్ధారించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో పరీక్షలు, చికిత్సకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. జిల్లాలో వైరల్ ఫీవర్ల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నట్లు నివేదికలు అందాయన్నారు. చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానలకు ఆశ్రయిస్తున్నారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో జ్వర
బాధితుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. వైరల్ జ్వరాలు వ్యాప్తి చెందకుండా అన్ని మున్సిపాలిటీలలో పూర్తి స్థాయి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. అందులో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లు, అధికారులు, పారిశుధ్య సిబ్బంది భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక డ్రైవ్లో భాగస్వామ్యమై వైరల్ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సోమవారం నుంచి వైరల్ జ్వరాలు తగ్గే వరకూ అదనపు కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విధిగా డ్రైవ్ చేపట్టాలన్నారు.
వైరల్ వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంటి పరిసరాలు, సామూహిక ప్రదేశాలలో మురుగు, వర్షపు నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలం సీజన్ ముగిసే వరకు వైద్యాశాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ సీజనల్ వ్యాధులను నియంత్రించే చర్యలు చేపట్టాలని మంత్రి హరీశ్రావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఆదివారం అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి పరిసరాలను శుభ్రంగా ఉండేలా చూస్తామని తెలిపారు. టెలీ కాన్ఫరెన్స్లో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు నొడితెల సతీష్కుమార్, రఘునందన్రావు, అదనపు కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పాల్గొన్నారు.