చిన్నకోడూరు, అక్టోబర్ 17 : ఆగి ఉన్న డీసీఎంను ఆటో ఢీకొట్టిన సంఘటన చిన్నకోడూరు మండలం రామునిపట్ల రాజీవ్ రదారిపై ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కోహెడ మండలం రేగులపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు.
ఈ క్రమంలో రోజు మాదిరిగానే కూరగాయలు కొనుగోలు చేసేందుకు సిద్దిపేటకు తన ఆటోలో వెళుతున్నాడు.
అతి వేగంగా ఉన్న ఆటో రామునిపట్ల గ్రామ శివారులోకి రాగానే రాజీవ్ రహదారి పై ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు బలమైన గాయం కాగా కాళ్లు చేతులకు గాయాలయ్యాయి. ఆటో నుజ్జునుజ్జయింది. స్థానికులు ప్రమాద విషయాన్ని 108 సిబ్బందికి సమాచారం అందివ్వడంతో ప్రవీణ్ను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.