సిద్దిపేట టౌన్ : గంజాయి విక్రేతను పట్టుకుని అతడి నుంచి 550 గ్రాముల మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిద్దిపేట టూటౌన్ పోలీస్స్టేషన్లో టాస్క్ఫోర్స్ సీఐ ప్రసాద్తో కలిసి సీఐ పరశురామ్గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గుండ్ల చెరువుకు చెందిన చిట్టిగారి అనిల్ అనే యువకుడు గంజాయిని విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా అనిల్ ఇంట్లో తనిఖీలు చేయగా సుమారు 550 గ్రాముల గంజాయి ప్యాకెట్లు లభ్యం కాగా, వాటిని స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనిల్ను విచారించగా గతంలో బతుకుదెరువు కోసం ముంబైకి వెళ్లి అక్కడ గంజాయికి అలవాటు పడ్డట్లు తెలిపారు. తిరిగి సిద్దిపేటకు వచ్చి మొక్కజొన్న కంకులు, పల్లీలు విక్రయిస్తూ జీవించేవాడని, లాక్డౌన్ సమయంలో ఉపాధి లేకపోవడంతో డబ్బులు సంపాదించాలనే అత్యాశతో హైదరాబాద్లోని ధూల్పేటకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు గంజాయిని కొని సిద్దిపేటలో ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు. అనిల్ను జ్యుడిషియల్ రిమాండ్కు తరలించామన్నారు.